Twist in Andhra Pradesh Politics: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల్లో చివరి జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. ఇందులోభాగంగా బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు, ఆరు ఎంపీలు పోటీకి అంగీకరించింది. ఇప్పుడు పది కాదు పదకొండు కావాలని మొండి కేసినట్టు వార్తలు జోరందు కున్నాయి. కమలం పార్టీలో ఏం జరిగిందోగానీ, మరో సీటు కావాలని పట్టుబడుతున్నారు ఆ పార్టీ నేతలు. దీంతో బీజేపీకి మరో సీటు తప్పక కేటాయించాల్సివస్తే.. త్యాగం చేసేదెవరు? తెలుగుదేశం పార్టీనా లేక జనసేన అన్న ఆసక్తి నెలకొంది.
విజయవాడలో ఏపీ బీజేపీ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. అయితే ఈ సమావేశానికి నలుగురు సీనియర్లు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్గా మారింది. వారిలో జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణవర్థన్రెడ్డి, సత్యకుమార్ రాలేదు. వేరే రాష్ట్రాల బాధ్యతలతో బిజీగా ఉండడంతో రాలేమని సమాచారం ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు.
దీని వెనుక కారణాలు చాలానే ఉన్నాయని ఆ పార్టీలోని నేతలు చెబుతున్నారు. జీవీఎల్ నరసింహారావు విశాఖ లేదా విజయనగరం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆలోచన చేశారు. పక్కాగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. సత్యకుమార్ తొలుత హిందూపురం పార్లమెంటు లేదా ధర్మవరం సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక విష్ణవర్థన్రెడ్డి అనంతపురం జిల్లా కదిరి నుంచి సీటు ఆశించారు. ఈ నేతలకు ఎంపీ సీట్లు దక్కకపోవడంతో కినుక వహించారు. పరిస్థితి గమనించిన బీజేపీ హైకమాండ్.. సమావేశంలో 11 సీట్లకు పోటీ చేస్తున్నట్లు అరుణ్సింగ్ ప్రకటన చేశారు. ఇవాళ్టి సమావేశంలో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని నేతలు బలంగా చెబుతున్నారు.
Also Read: Purandeswari comments: అందుకోసమే త్రివేణి సంగమం.. అజెండా అదే..!
బీజేపీ కోరుతున్న సీటు ఎవరికి? ఎక్కడ నుంచి ఆశిస్తోంది? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే రాజంపేట లేదా తంబళ్లపల్లె సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది. అనపర్తికి బదులు రాజమండ్రి అర్బన్ లేదా రూరల్ కావాలని పట్టుబడుతోంది. అనపర్తిలో పోటీ చేసేందుకు సోము వీర్రాజు ససేమిరా అన్నట్లు సమాచారం. ఇక రాజమండ్రి రూరల్ సీటు తొలుత జనసేనకు కేటాయించింది టీడీపీ. అయితే టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో చివరకు బుచ్చయ్యకు ఆ సీటు ఓకే చేశారు. కందుల దుర్గేష్కు నిడదవోలు నుంచి ఓకే కావడం జనసేన ప్రకటన చేయడం జరిగిపోయింది.