2024 జులైలో జరగనున్న మహిళల ఆసియా కప్నకు సంబంధించిన షెడ్యూల్ ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. టోర్నీ చరిత్రలో తొలిసారిగా 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్లు కలిసి ఉన్నాయి. వీటితో పాటు యూఏఈ, నేపాల్ ఉన్నాయి. గ్రూప్ బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్లాండ్ మలేషియా ఉన్నాయి.
ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జులై 26న సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. అక్కడ నుంచి ఫైనల్ కు చేరిన జట్లు జూలై 28న తలపడతాయి. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఏడు టైటిల్స్తో భారత్ విజయవంతమైన జట్టుగా నిలిచింది.
Also Read: మళ్లీ రోహిత్ శర్మకి కెప్టెన్సీ?
మహిళల క్రికెట్కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి మాకెంతో సంతోషంగా ఉందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా పేర్కొన్నారు. 2018లో ఆరు జట్లతో మొదలై, 2022లో ఏడు జట్లకు చేరింది. 2024లో ఎనిమిది జట్లు ఆడటం నిజంగా గొప్ప విషయమని అన్నారు. పురుషుల క్రికెట్ కి దీటుగా మహిళా క్రికెట్ ను కూడా తీర్చిదిద్దాలనేది మా సంకల్పం అని జైషా తెలిపారు. ఆసియా కప్ లో విశేషం ఏమిటంటే ఈసారి టోర్నమెంట్ లో మహిళా అంపైర్లు పాల్గొంటున్నారు.