Ex MLA MadanReddy: బీఆర్ఎస్ నుంచి వలసలు కంటిన్యూ అవుతన్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు అధికార కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లిపోయారు.. ఇంకా వెళ్లిపోతున్నారు కూడా. తాజాగా ఈ జాబితాలోకి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కూడా చేరిపోయారు. మంగళవారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో ఆయన భేటీ అయ్యారు. ఆయన నుంచి క్లారిటీ రావడంతో రేపో మాపో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
మదన్రెడ్డి పార్టీ మారడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ ఎంపీ సీటు ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చిందట. ఇటీవల వెల్లడించిన జాబితాలో ఆయనకు కాకుండా వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఈ కారణంగానే ఆయన కారు నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి. తన అనుచరులతో మంతనాలు కూడా సాగించారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేడర్ నిలబడాలంటే పార్టీ మారడడమే బెటరని సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే మదన్రెడ్డి పార్టీ మారాలని భావించారు.
Also Read: Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ వ్వవహారం.. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నేనే బాధితుడిని..
నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండుసార్లు గెలుపొందారు మదన్రెడ్డి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావించారు. కాకపోతే ప్రస్తుతం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రూపంలో ఆయనకు చుక్కెదురైంది. అప్పట్లో సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో ఆయన కినుక వహించారు. కొద్ది రోజులపాటు ఆయన ఎవరితో మాట్లాడలేదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈలోగా బీఆర్ఎస్కు చెందిన నేతలు ఆయనతో మంతనాలు సాగించడంతో కాస్త మెత్తబడ్డారు. తాజా పరిణామాలతో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.