Farm house case : తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్ మంజూరు చేస్తే ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.కేసు దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సీజే ధర్మాసనాన్ని శనివారం ఆశ్రయించారు. స్టేను యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపించాలని ప్రేమేందర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం మంగళవారం విచారణ చేపడతామని తెలిపింది.