Pakistan Naval Air Base Attack: పాకిస్థాన్లో ఉగ్రదాడులు తీవ్రమయ్యాయి. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇది. ఈ మధ్యకాలంలో పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కొద్దిరోజుల కిందట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్స్టేషన్ పీఎన్ఎస్ సిద్ధిఖ్పై ముష్కరులు విరుచుకుపడ్డారు.
సోమవారం అర్థరాత్రి ఈ దాడి జరిగింది. ఈ స్థావరంపై తిరుగుబాటుదారులు పాక్ ఆర్మీ దుస్తులు ధరించి బాంబులు విసురుతూ లోనికి చొరబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పాకిస్థాన్ సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. దాదాపు ఆరుగంటలపాటు మెరుపుదాడులు సాగినట్టు తెలుస్తోంది. కాల్పులు, పేలుళ్లతో ఎయిర్ బేస్ దద్దరిల్లింది. ఈ ఘటనలో నలుగురు ముష్కరులను మట్టుబెట్టారు. అయితే ఎయిర్ స్టేషన్కు ఎలాంటి నష్టం జరగలేదన్నది అధికారుల మాట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చైనాకి చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మొహరించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. తమ కాల్పుల్లో పాక్కి చెందిన పలువురు మృతి చెందినట్టు పేర్కొంది. దీనిపై పాకిస్థాన్ సైన్యం ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. అయితే వారం రోజులుగా దాడికి ప్రయత్నించడం ఇది రెండోసారి. వారం కిందట గ్వాదర్ పోర్టుపై తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పాక్ బలగాలు ఏడుగుర్ని హతమార్చాయి. తుర్బత్లో ఉన్న పీఎన్ఎస్ సిద్ధిఖ్లోకి ప్రవేశిస్తుండగా వాళ్లని మట్టబెట్టింది పాక్ సైన్యం.
అసలు ఎందుకు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు ప్రయత్నించింది? సరిహద్దుల్లో అక్కడేం జరుగుతోంది? ఇంకా లోతుల్లోకి వెళ్తే.. పాకిస్థాన్లో అతిపెద్ద ప్రావిన్స్గా పిలిచే ప్రాంతం బలూచిస్తాన్. అనేక కొండలతో కూడిన ప్రాంతం. ఏళ్ల తరబడి ఇక్కడి స్వాతంత్య్రం కోసం అనేక గ్రూపులు తిరుగుబాటు చేస్తున్నాయి. వీరి బెడదను తప్పించుకునేందుకు ఈ ప్రాంతం మీదుగా పాకిస్థాన్-చైనా మధ్య ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అనేక ప్రాజెక్టులకు చైనా నిర్మిస్తోంది. దీన్ని అక్కడి ఉద్యమ గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్ఏ వేర్పాటు వాద సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Also Read: Gaza Updates: రంజాన్ వేళ ఐరాస భద్రత మండలి తీర్మానం.. గాజాలో కాల్పుల విరమణకు ఆదేశం
ముఖ్యంగా ఆ ప్రాంతంలో గ్యాస్, ఖనిజ వనరులను దోపిడి కోసమే చైనా ప్లాన్ చేసిందన్నది అక్కడి తిరుగుబాటు గ్రూపుల వాదన. అయితే ఇటీవలకాలంలో చైనా నుంచి ఆయుధాలను పాకిస్థాన్ భారీగా దిగుమతి చేసుకుంటోందని వేర్పాటువాద గ్రూపులు భావిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ దాడుల కోసం ప్రయత్నించాయి. అదును చూసి నేవీ ఎయిర్బేస్ స్టేషన్పై దాడికి తెగబడ్డాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డేంజరని, దీన్ని ఉగ్రవాద సంస్థగా పాకిస్థాన్ సహా అమెరికా, యూకే దేశాలు గుర్తించాయి.
మరోవైపు పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ బోర్డర్లో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. ఇరుదేశాలు బలగాలను ఆ ప్రాంతంలో మొహరించాయి. ఇది జరుగుతుండగానే.. బెలుచిస్తాన్ ప్రాంతంలో ఈ దాడి జరగడం వెనుక తాలిబన్ల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పాక్ ప్రభుత్వం ఆరా తీస్తోంది.