Kavitha ED Custody: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన అధికారులు.. 16న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి వారంరోజులు కస్టడీకి తీసుకున్నారు. ఆ గడువు ముగిశాక.. మరో ఐదురోజులు కస్టడీకి కావాలని కోరగా కోర్టు మూడురోజులు కస్టడీని పొడిగించింది. కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు నేటితో ముగియనుంది. 10 రోజులుగా కవితను ప్రశ్నించిన ఈడీ.. కీలక విషయాలపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
కవిత నుంచి రాబట్టిన సమాచారాన్ని ఈడీ అధికారులు నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించనున్నారు. నేటితో ఆమె కస్టడీ ముగియడంతో కవితను కోర్టు జైలుకు పంపుతుందా ? లేక బెయిల్ ఇస్తుందా ? ఈ రెండు కాకుండా మరింత కస్టడీ గడువు కావాలని ఈడీ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మూడింటింలో ఏం జరుగుతుందన్న అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా.. తీహార్ జైల్లో ఉన్న సమీర్ మహేంద్రును కూడా ఈడీ అధికారులు మార్చి 24 ఆదివారం విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే కవిత, కేజ్రీవాల్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొదట కవితను ఏడురోజులు కస్టడీకి ఇచ్చినా.. ఆమె సహకరించలేదని ఈడీ ఇప్పటికే కోర్టుకు వెల్లడించింది. మరి తర్వాతి మూడురోజుల విచారణలో అయినా కవిత సహకరించిందా ? ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారా ? అన్నది నివేదికలో పేర్కొన్నారు.
Also Read: ఒంగోలు టిడిపి ఎంపీ టికెట్.. మాగుంటకే ఫైనల్
లిక్కర్ స్కామ్ లో అరెస్టైన కేజ్రీవాల్ ఈడీ కస్టడీ గడువు మార్చి 28తో ముగియనుంది. ఈ స్కామ్ లో ఆప్ అందుకున్న ముడుపులు, వాటిని ఎన్నికల్లో ఖర్చు చేయడం వంటి అంశాలపై ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.