AAP Launches Social Media Arvind Kejriwal DP Campaign: లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఆప్ దేశవ్యాప్త ఆందోళనలు పిలుపునిచ్చింది. ప్రస్తుతం తాము చేస్తున్న పోరాటం మరింత మంది ప్రజలకు చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా ‘డీపీ క్యాంపెయిన్’ను ఆప్ ప్రారంభించింది.
కేజ్రీవాల్ ను మద్యం కుభకోణం కేసులో అరెస్ట్ చేయడాన్ని నిరసనగా ఆప్.. సోషల్ మీడియా ‘డీపీ క్యాంపెయిన్’ను సోమవారం ప్రారంభించింది. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము ఈ పోరాటం చేస్తున్నామని ఆప్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిశీ తెలిపారు. తమ పార్టీ నేతలు, వాలంటీర్లంతా ఎక్స్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాల్లో కేజ్రీవాల్ కస్టడీలో ఉన్న ఫొటోలను డిస్ ప్లేలో మార్చుకుంటారని తెలిపారు. ప్రజలు సైతం తాము చేస్తున్న ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నట్లుగా ఉన్న ఆ ఫోటోపై మోదీకి అతిపెద్ద భయం కేజ్రీవాల్ అని హిందీలో రాసి ఉంటుందన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ క్యాంపెయిన్ మొదలైంది. ఆప్ నేతలు, కార్యకర్తలు తమ డీపీలు మార్చుకుంటున్నారని మంత్రి అతిశీ తెలిపారు. దేశంలో మోదీని ఎదుర్కొనే ఏకైన నేత కేజ్రీవాల్ ఒక్కరేనని అన్నారు. దీని కారణంగానే సార్వత్రిక ఎన్నికల ముందు ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిందని ఆమె ఆరోపించారు.
Also Read: Lok Sabha Elections 2024: అధినేతలపై పోరాడేది వీరే..
దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆప్ యుద్ధం చేస్తోందన్నారు. అందుకే నకిలీ కేసుల్లో ఇరికించి.. ఈడీ సాయంతో కేజ్రీవాల్ ను జైల్లో పెట్టారని అన్నారు. గడిచిన రెండేళ్లుగా ఈ కేసులో విచారణ జరుగుతున్నా సరే.. ఒక్క పైసాకు సంబంధించి కూడా ఆధారాలు సంపాధించుకోలేకపోయిందని అన్నారు. బేజేపీ కేజ్రీవాల్ ను అణిచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21న రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 28వ తేదీ వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అప్పగించింది.