శుక్రవారం భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు… ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సోమవారం నష్టపోయాయి. ఉదయం ఫ్లాట్గా మొదలైన సూచీలు… ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని చివరిదాకా లాభనష్టాల్లో ఊగిసలాడాయి. రూపాయి మళ్లీ బలహీనపడటం, ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దాంతో చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తి… సూచీలు నష్టాల్లో ముగిశాయి.
గత శుక్రవారం వెయ్యి పాయింట్లకు పైగా ఎగసింది… సెన్సెక్స్. సూచీ ఏకంగా ఏడాది గరిష్టస్థాయికి చేరింది. దాంతో… చాలామంది ఇన్వెస్టర్లు లాభాల దగ్గర షేర్లు అమ్మేందుకు సిద్ధపడ్డారు. దాంతో… సోమవారం 30 పాయింట్ల నష్టంతో 61,765 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్…. 61,916-61,572 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 170 పాయింట్ల నష్టంతో 61,624 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్లు మాత్రమే నష్టపోయి… 18,329 పాయింట్ల దగ్గర ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో 17 షేర్లు లాభపడ్డాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, హెచ్యూఎల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటన్, విప్రో, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ షేర్లు నష్టపోయాయి.
ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 48 పైసలు నష్టపోయి… 81 రూపాయలా 26 పైసల దగ్గర స్థిరపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఉదయం 80 రూపాయలా 53 పైసల దగ్గర బలంగా ప్రారంభమైన రూపాయి విలువ… చివరికి 48 పైసలు నష్టపోయింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరగవచ్చనే భయాలు, డాలర్ మళ్లీ పుంజుకోవడమే రూపాయి నష్టానికి కారణమని చెబుతున్నారు.