Lok Sabha 1st Phase Nominations: దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు పార్టీలు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను రిలీజ్ చేస్తున్నాయి. ఇంకోవైపు తొలి విడత నామినేషన్ల సందడి మొదలైంది. తమతమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ జాబితాలో ముందు ఉన్నారు బీజేపీ నుంచి తమిళిసై, కాంగ్రెస్ నుంచి కార్తీ చిదంబరం. హోలీ సందర్భంగా తమ నామినేషన్లను దాఖలు చేశారు.
మార్చి 20న లోక్సభ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులోభాగంగా ఫస్ట్ ఫేజ్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులోని సౌత్ చెన్నై నుంచి నామినేషన్ వేశారు మాజీ గవర్నర్, బీజేపీ అభ్యర్థి తమిళిసై. రిటర్నింగ్ అధికారిని తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
తమిళిసై నామినేషన్ సందర్భంగా డీఎంకె సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి తంగపాడియన్ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా ఇటు తమిళిసై.. అటు తండపాడియన్ ఎదురుపడ్డారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బెస్టాఫ్ లక్ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో సౌత్ చెన్నై నుంచి లక్షా 40 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారామె. పాండియన్ మంచి వక్త, రచయిత్రి కూడా. గతంలో కాలేజీ లెక్చరర్గా పని చేశారు. అంతేకాదు ఓ సిన్మాకి డైలాగులు రాశారు. దీంతో ఇరువురు నేతల మధ్య ఆసక్తిపోరు నెలకొంది. అన్నాడీఎంకె తరపున డాక్టర్ జయవర్థన్ బరిలో ఉన్నారు.
Also Read: Radika Sarathkumar: నామినేషన్ దాఖలు చేసిన రాధికా శరత్ కుమార్.. ఆస్తులు రూ. 50 కోట్లపైనే..
నామినేషన్ల తర్వాత మీడియాతో మాట్లాడిన తమిళిసై.. ప్రజలతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే గవర్నర్ పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. ఈ నియోజకవర్గం ప్రజలు బాధ్యత కలిగినవారని, మంచి పార్లమెంటేరియన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రస్తుతమున్న ఎంపీ ప్రజలకు అందుబాటులో ఉండరని తేల్చేశారు. రాజ్యాంగబద్దమైన హోదాలో ఉన్నప్పుడు తాను ప్రజల కోసం అందుబాటులో ఉన్నానని గుర్తుచేశారు.
తమిళనాడులోని మరో నియోజకవర్గం శివగంగ. ఇక్కడ నుంచి చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అందులో ఆస్తులు, అప్పులతో కూడిన అఫిడవిట్ను సమర్పించారు. ఈ నియోజకవర్గం చిదంబరం ఫ్యామిలీకి కోట. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో మూడుసార్లు చిదంబరం ఫ్యామిలీ గెలిచింది. ఈసారి కూడా తన పట్టు నిలుపుకోవాలని ఆలోచన చేస్తున్నారు కార్తీ చిదంబరం.