TDP Sugunamma Emotional: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య సీట్లు దాదాపు కొలిక్కి వచ్చేశాయి. నాలుగైదు ఎంపీ అభ్యర్థులను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన అసెంబ్లీ అభ్యర్థులు ఐదు నుంచి పది లోపు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా టెంపుల్ సిటీ తిరుపతి అసెంబ్లీ సీటుపై టీడీపీ- జనసేన నుంచి కాస్త ఆశావహులు పెరిగారు. తిరుపతి సీటును జనసేనకు కేటాయింపు విషయంలో టీడీపీ ఒక్కసారి పునరాలోచించుకోవా లన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.
పార్టీ కోసం అహర్నిశలు పని చేశానంటూ భావోద్వేగానికి గురయ్యారు సుగుణమ్మ. సోమవారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడిన ఆమె, ఎక్కడి నుంచో వచ్చినవారికి మద్దతు పలుకుతామంటే తాను ఓకే చెప్పినా, కేడర్ మాత్రం ససేమిరా అంటోందని చెప్పుకొచ్చారు. తిరుపతి అభ్యర్థి విషయమై మరోసారి ఆలోచిస్తారని అనుకున్నట్లు తెలిపారు. వైసీపీతో అనునిత్యం పోరాటం చేశామని, ఆ పార్టీ నుంచి వచ్చినవారికి సీటు కేటాయిస్తామంటే అంగీకరించరని తెలియజేశారు.
తిరుపతి నుంచి సుగుణమ్మ భర్త వెంకటరమణ తొలిసారి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో అక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి విజయం సాధించారు. అయితే చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి భూమన కరుణాకర్రెడ్డి గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున వెంకటరమణ మళ్లీ విజయం సాధించారు. మరుసటి ఏడాది ఆయన చనిపోవడంతో అక్కడ నుంచి సుగుణమ్మ ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం సీటు విషయమై ఆమెని సముదాయిస్తున్నారు టీడీపీ నేతలు. పొత్తులో భాగంగా కొన్ని స్థానాలను త్యాగం చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
Also Read: Pawan Varahi Yatra : పవన్ వారాహి యాత్ర వాయిదా.. మూడ్రోజులు పిఠాపురంలోనే మకాం
పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేనకు వెళ్లింది. తిరుపతి నుంచి జనసేన తరపున ఆరణి శ్రీనివాసులు దాదాపు ఖాయమైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సీటు విషయమై రెండురోజుల కిందట జనసేన నేతలను పిలిచి నాగబాబు మాట్లాడారు. ఇక్కడి నుంచి హరిప్రసాద్, కిరణ్రాయల్ టికెట్ను ఆశిస్తున్నారు. మనం గెలవాలంటే నేతల్లో ఐక్యత ఉండాలని నాగబాబు గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది.