2 Degree Temperature Increased in Telangana State: ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత మొదలైంది. ఇప్పుడు మార్చి చివరికి వచ్చేశాం. ఇకపై ఎండలు మరింత ఠారెత్తించనున్నాయి. ఇప్పటికే ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 6 గంటలకు వాతావరణం కాస్త చల్లగా అనిపించినా.. 8 గంటలు దాటితే చాలు.. సూరీడు సుర్రు సుమ్మనిపిస్తున్నాడు. బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు ప్రజలు. గొడుగులు, స్కార్ఫ్ లు, రుమాళ్లు కట్టుకుని.. ఎప్పుడెప్పుడు గమ్యస్థానాలకు చేరుకుంటామని పరిగెడుతున్నారు. భూమిపై పెరుగుతున్న కాలుష్యం మూలంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ఎండత తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముందునుంచే హెచ్చరిస్తోంది ఐఎండీ. చెప్పినట్లే.. భానుడి భగభగలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లిన వారికి.. ముఖాలు మాడిపోతున్నాయి. చిగురుటాకైనా ఊగక.. చిరు ఉపశమనం కూడా కలగటం లేదు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇక నేటి నుంచి.. ఐదురోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రం వైపు కిందిస్థాయి గాలులు వీస్తుండటంతో రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నట్లు అధికారులు వెల్లడించారు. నేటి నుంచి ఐదురోజులపాటు.. విపరీతమైన ఉక్కపోత, ఉష్ణోగ్రతలు ఉంటాయని, రాత్రివేళల్లో కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అంటే పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 మధ్యలో నమోదయ్యే అవకాశాలున్నాయి.
Also Read: టెన్త్ పరీక్ష విధుల్లో నిర్లక్ష్యం.. ఆరుగురు సస్పెండ్..
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచించారు. నీడపట్టున ఉండాలని, పిల్లలు, వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అలాగే ఎండలో తిరిగే వారు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని తీసుకోవాలని సూచించారు. హైడ్రేటెడ్ గా ఉండాలని, చల్లటి పానీయాలకు దూరంగా ఉండాలని తెలిపారు.