Save Democracy March: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ నేపథ్యంలో ఆప్ పార్టీ నేతలు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ఓటమి భయంతోనే బీజేపీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిందంటూ ఆరోపింస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలికి పిలుపునిచ్చింది. మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు ప్రతిపక్షాల నేతలు తెలిపారు.
లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్.. మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సేవ్ డెమోక్రసీ పేరుతో ఈ భారీ బహిరంగ ర్యాలీ చేపడుతున్నట్లు వెల్లడించింది. ఆప్ నేతలతో కలిసి కాంగ్రెస్, సీపీఎం నేతలు సంయుక్త నిరసనలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆప్ నేతలు తెలిపారు.కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తీరుపై ప్రజల్లో చాలా ఆగ్రహం ఉందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాల కూటమి ఆరోపించింది. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందని విమర్శించారు.
Also Read: Delhi liquor scam update:క్లైమాక్స్లో లిక్కర్ స్కామ్ కేసు.. కవిత, కేజ్రీవాల్ని విచారించేందుకు..
కేజ్రీవాల్ అరెస్ట్ పై ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికైన సీఎంలను అరెస్ట్ చేస్తున్నారని, పురాతన పార్టీలకు చెందిన ఖాతాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారని.. ఈ సమయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్య దేశమేనా అంటూ ప్రశ్నించారు. మార్చి 31వ తేదీనా ఇండియా బ్లాక్ కు చెందిన మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వచ్చి ర్యాలీలే పాల్గొంటారని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ తెలిపారు. ప్రజాస్వామ్యంపై జరిగే ఇటువంటి దాడులను తాము సహించేది లేదని అన్నారు.