Moscow Attack behind on Telegram app: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నిందితులు కేవలం మెసేజింగ్ టెలిగ్రామ్ యాప్ నుంచి దాడుల తతంగాన్ని నడిపినట్లు అధికారులు గుర్తించారు. నిందితులను బ్రియాన్స్క్ ప్రాంతంలోని ఖట్సన్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది.
డబ్బులు, ఆయుధాలు ఇచ్చినవారెవరో తెలీదని నిందితులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను నేషనల్ ఛానెళ్లు ప్రసారం చేశాయి. అలాగే నిందితులు వాడిన కారును కూడా సొంత చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు రష్యా యాసలో మాట్లాడుతున్నాడు. వీరంతా తజికిస్థాన్కు చెందినవారని రష్యా నేతలు చెబుతున్నారు. నిందితుల్లో ఒకరు మాత్రం తాము కేవలం డబ్బుల కోసమే ఈ దారుణానికి పాల్పడ్డామని చెబుతున్నారు.
ఈ డీల్లో భాగంగా నిందితుల బ్యాంక్ ఖాతాలో సగం మనీ వేసినట్టు గుర్తించారు అధికారులు. అయితే డబ్బు, ఆయుధాలు సరఫరా చేసినవారు ఎవరో తెలీదని చెప్పుకొచ్చారు. కేవలం టెలిగ్రామ్ యాప్ నుంచే సంప్రదింపులు జరిగినట్టు తెలిపారు. ఘటన తర్వాత ఆయుధాలను రోడ్డు పక్కన పారేసినట్టు మరో నిందితుడు చెప్పుకొచ్చాడు.
ఈ ఘటనలో ఇప్పటివరకు 133 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలావుండగా ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటన చేసింది.