Mla Varaprasad join in Bjp: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీకి నేతలు షాకులిస్తున్నారు. ఒకొక్కరుగా ఆ పార్టీని వీడితున్నారు. ఈ జాబితాలో మాజీ ఎంపీ, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చేరిపోయారు. వైసీపీకి గుడ్ బై చెప్పేసిన ఆయన.. బీజేపీలోకి చేరిపోయారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ సమక్షంలో కండువా కప్పుకున్నారు.
ఎమ్మెల్యే వరప్రసాద్ పార్టీ మారడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో సీఎం జగన్ ఆయనకు మొండిచేయి చూపారు. గూడూరు టికెట్ను ఈసారి మురళీధరరావుకు కేటాయించారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురయ్యారు ఆయన. తనకున్న పరిచయాలతో బీజేపీ హైకమాండ్తో మంతనాలు జరిపారు. అటు నుంచి ఎలాంటి సంకేతాలు ఏ విధంగా వచ్చాయో తెలీదుగానీ ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లడం, పార్టీ బీజేపీ కండువా కప్పుకోవడం చకచకా జరిగిపోయింది.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్.. 2009 ఏడాదిలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్లోకి వెళ్లారు. ఈలోగా విభజన జరగడంతో వైసీపీ గూటికి వెళ్లిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి ఎక్కడైతే ఓడిపోయారో.. మళ్లీ అక్కడే ఎంపీగా విజయం సాధించారు. మరోసారి తిరుపతి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఆయనకు రాలేదు.
దీంతో 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వరప్రసాద్ విజయం సాధించారు. జగన్ కేబినెట్లో మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ వరప్రసాద్కు నిరాశే ఎదురైంది. అప్పటి నుంచి వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తనదైశ శైలిలో పార్టీపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. వరప్రసాద్ పరిస్థితి గమనించిన వైసీపీ హైకమాండ్.. మాజీ ఐఏఎస్తో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈసారి ఎన్నికల్లో ఆయనకు మొండిచేయి చూపింది.
తొలుత టీడీపీలోకి వెళ్లాలని ఆయన అనుకున్నా.. ఆ పార్టీ నుంచి సరైన సంకేతాలు రాకపోవడంతో జనసేనలోకి వెళ్లేందుకు ట్రై చేశారు. కాకపోతే సీటు విషయంలో ఎలాంటి హామీ రాలేదు. ఇక ఆలస్యం చేయకూడదని భావించి వెంటనే బీజేపీలోకి వెళ్లిపోయారు. వరప్రసాద్కు బీజేపీ తిరుపతి ఎంపీ టికెట్ ఖాయమయ్యిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు బీజేపీ నుంచి 2024 ఉపఎన్నికల్లో పోటీ చేసిన రత్నప్రభ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈలోగా వరప్రసాద్ వెళ్లడంతో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.