Delhi liquor scam update: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తు వేగవంతమైంది. మరో పది రోజుల్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో లోతుగా విచారణ మొదలుపెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కీలక నేతలను అరెస్టు చేయడంతో వాళ్ల బంధువులపై దృష్టి సారించింది.
ఇప్పటికే కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో శనివారం సోదాలు చేసిన ఈడీ, కీలకపత్రాలతోపాటు పలు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ కాల్ డేటాను పరిశీలించే పనిలోపడ్డారు అధికారులు. అలాగే ఆమ్ ఆద్మీపార్టీ నేతల ఇంటిపై సోదాలు చేశారు. దీంతో వీరిద్ధరినీ కలిపి విచారించాలని భావిస్తోంది. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించింది ఆర్ఎంఎల్ హాస్పిటల్ వైద్య బృందం.
గతంలో అరవింద్ కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, మేకా శరణ్, శరత్ చంద్రారెడ్డి, ఇతర వ్యాపార భాగస్వాములతో మాట్లాడిన కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, స్క్రీన్ షాట్లను ఇద్దరి ముందు ఉంచి ప్రశ్నించనుంది ఈడీ. తొలుత అరవింద్ కేజ్రీవాల్, కవితను కలిపి విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆలోచన చేస్తోంది. విడివిడిగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత.. ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కలిపి విచారించనున్నట్లు సమాచారం.
మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కవిత తన కుటుంబానికి సంబంధించి వ్యాపార వివరాలు వెల్లడించలేదని సమాచారం. ఆమె మేనల్లుడు మేకా శరణ్ గురించి ఏమీ తెలీదని చెప్పినట్టు ఈడీ తన రిపోర్టులో రాసుకొచ్చింది. కవిత, సమీర్, మాగుంటలకు సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో శరణ్ కూడా పాల్గొన్నాడని భావిస్తోంది ఈడీ. కవిత అరెస్టు సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్లో ప్రస్తావించింది. దీనికి సంబందించి డీటేల్స్ అంతా శరణ్ వద్ద ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే రెండుసార్లు మేకా శరణ్ను విచారణకు పిలిచినా హాజరు కాలేదని సమాచారం. ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన కీలక నేతలు ఈడీ, మరొకొందరు కస్టడీలో ఉండడంతో వేగంగా కేసు పూర్తి చేయవచ్చని భావిస్తోంది ఈడీ.
మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మాటల దాడిని పెంచింది బీజేపీ. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత కథ గురించి ఆలోచిస్తే, దాని టైటిల్ ‘ఏక్ సఫర్-స్వరాజ్ సే షరబ్ తక్’ అవుతుందన్నారు ఆ పార్టీ ఎంపీ మనోజ్ తివారీ. స్వరాజ్ గురించి మాట్లాడే ప్రయాణం ప్రారంభమైంది, కానీ అది షరబ్తో ముగిసిందన్నారు. అరవింద్ తాను చట్టాన్ని అనుసరించనని, చట్టాన్ని అనుసరించడానికి ఎవరినీ ప్రేరేపించనని నిర్ణయించుకున్నారని తెలిపారని గుర్తచేశారు.