Kerala Govt vs President on supreme court: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారంటూ పినరయి విజయన్ సర్కార్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ఖాన్, రాష్ట్రపతి ముర్ముపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమ వద్ద పెట్టుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అందులో ప్రస్తావించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని అందులో కోరింది.
కేరళ శాసనసభ నాలుగు బిల్లులను ఆమోదించింది. వాటిలో యూనివర్సిటీ చట్టాల బిల్లులకు సంబంధించి నాలుగు, మరో మూడు బిల్లులను కూడా ఆమోదించి గవర్నర్ వద్దకు పంపింది. వాటిపై సంతకం పెట్టకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. దీన్ని విజయన్ సర్కార్ తప్పుబట్టింది. ఎలాంటి కారణాలు లేకుండా బిల్లులను రాష్ట్రపతి జాప్యం చేయడాన్ని ఆరోపించింది. ఈ బిల్లులను నిలుపుదల చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
అధికరణ 32 ప్రకారం గవర్నర్ ఆరిఫ్ఖాన్ చర్యలను తప్పుబట్టింది విజయన్ సర్కార్. బిల్లులోని అంశాలు కేంద్ర-రాష్ట్ర సంబంధాలతో ముడిపడి లేకపోయినా వాటిని రాష్ట్రపతికి పంపడాన్ని ప్రశ్నించింది. ఈ తరహా చర్యలు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. కేంద్రాన్ని, రాష్ట్రపతి కార్యదర్శిని, గవర్నర్ను, ఆయన అదనపు కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది.
అంతకుముందు బిల్లులపై నెలల తరబడి గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ గతంలో కేరళ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది నవంబర్ 20న సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో బిల్లులను గవర్నర్.. రాష్ట్రపతికి పంపారు. అదేనెల 29న ప్రబుత్వ పిటిషన్ను విచారించిన కోర్టు.. గవర్నర్ చర్యలను తప్పుబట్టింది. ఈ క్రమంలో గతనెల 29న మూడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మరో నాలుగు బిల్లులపై నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు కారణాలు తెలపాలని పిటిషన్లో కేరళ సర్కార్ పేర్కొంది. బిల్లులన్నీ రాష్ట్ర పరిధికి సంబంధించినవని, వీటిని ఆపడమంటే సమాఖ్య వ్యవస్థకు నష్టం కలిగించడమేనని ప్రస్తావించింది.
చాన్నాళ్లుగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్- విజయన్ సర్కార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొద్ది రోజుల కిందట కేరళలోని ఓ యూనివర్సిటీకి గవర్నర్ వెళ్లినప్పుడు అక్కడ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. అంతేకాదు ఆయన కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలిపారు. గవర్నర్ ఎక్కడికి వెళ్లినా ఇలాంటి నిరసనలే ఎదురవుతున్నాయి. ఓసారైతే గవర్నర్ తన కాన్వాయ్ దిగి ఓ హోటల్ వద్ద నిరసన తెలిపిన ఘటనలూ లేకపోలేదు.