Phone Tapping Case (political news): రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. అదనపు ఎస్పీలు భుజంగరావు ,తిరుపతన్నలు తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ ఇద్దరిని అరెస్టు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు కలిసి ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. అనధికారంగా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పటికే పలువురు ప్రముఖుల వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నట్లు గుర్తించారు. బాధ్యత గల ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ పలువురు వ్యక్తుల కోసం పనిచేసినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు గత ప్రభుత్వానికి ఫోన్ టాపింగ్ సమాచారం కూడా ఇచ్చినట్లు గుర్తించారు. టాపింగు డివైస్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన నిందితుడు ప్రణీత్ రావును ఇప్పటికే 6 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. నేడు మరోసారి ప్రణీత్ రావును విచారించనున్నారు.
రేపు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో అరెస్టైన ఇద్దరు ఎస్పీలు వివిధ భాగాలకు చెందిన వారని డీఎస్పీ తెలిపారు. భుజంగరావు భూపాలపల్లి ఎస్పీ పనిచేస్తుండగా.. ఇంతకుముందు ఇంటెలిజెంట్ పొలిటికల్ వింగ్ లో అనదపు ఎస్పీగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక మరోవైపు ఎస్బీఐలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ తిరుపన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని పీఎస్ లో స్పెషల్ టీమ్ ముందు తిరుపన్న హాజరయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్బీఐలో పనిచేసిన వాళ్లందరినీ పోలీసులు విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని విచారించడం ద్వారా వచ్చే సమాచారంతో మరొకొంత మందిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పాల్గొంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు భారీ పోలీస్ ఆపరేషన్ చేపట్టారు. ఇఖ డిసెంబర్ 4వ తేదీన ఈ కేసులో కీలక రికార్డులు ధ్వంసమైన సమయంలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై పోలీసులు స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే వికారాబాద్ ఫారెస్ట్, మూసీ రివర్ లో హార్డ్ డిస్కుల శకలాలు స్వాధీనం చేసుకున్నారు.