Nitin on electoral bonds (India today news): లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఎన్నికల బాండ్లపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో అన్ని పార్టీల కంటే ఎక్కువగా లాభపడింది ఒక్క బీజేపీయేనంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ అంశాన్ని ఎదుర్కొనడానికి అధికార బీజేపీ నానాకష్టాలు పడుతోంది. ఎందుకంటే మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన చట్టం కావడంతో అందరూ వేలు పెట్టి ఆ పార్టీనే చూపిస్తున్నారు.
విరాళాలు లేకుండా రాజకీయ పార్టీలను నడపడం కష్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. మంచి ఉద్దేశంతో కేంద్రం ఎన్నికల బాండ్ల స్కీమ్ను తీసుకొచ్చిందన్నారు. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, నిధుల్లేకుండా పార్టీలు ఎన్నికల్లో ఎలా పోరాడుతాయని ప్రశ్నించారు. పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. లోపాలను సరిదిద్దాలని పార్టీలను న్యాయస్థానం కోరితే బాగుండేదని మనసులోని మాట బయటపెట్టారు. అలాంటి ఆదేశాలొస్తే పార్టీలన్నీ కూర్చుని దీనిపై చర్చించుకోవాలన్నారు.
గుజరాత్లోని గాంధీనగర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి గడ్కరీ ఈ అంశంపై మాట్లాడారు. అరుణ్జైట్లీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కీమ్ గురించి జరిగిన చర్చల్లో తాను ఉన్నానని గుర్తు చేశారు. కొన్నిదేశాల్లో అయితే రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలే నేరుగా నిధులు సమకూరుస్తాయని, మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదన్నారు. అందుకే కేంద్రం ఈ స్కీమ్ని తీసుకొచ్చిందన్నారు. దీనివెనుక అసలు ఉద్దేశం పార్టీలు నేరుగా నిధులు పొందేందుకేనని వెల్లడించారు. అధికారంలో ఉన్న పార్టీ మారితే సమస్యలు తలెత్తుతాయన్న కారణంతోనే దాతల పేర్లు బయట పెట్టలేదన్నారు.
అంతకుముందు ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా కూడా మాట్లాడారు. బీజేపీ కంటే విపక్షాలకే ఎక్కువ నిధులు వచ్చాయని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. మొత్తం బాండ్ల ద్వారా వచ్చిన నిధుల్లో బీజేపీకి కేవలం ఆరువేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని, మిగతా 14వేల కోట్ల రూపాయలు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. అవి విపక్షాలకు వెళ్లిన మాట వాస్తవం కాదా అంటూ ఎదురు ప్రశ్నవేశారు. పనిలోపనిగా కాంగ్రెస్పైనా విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.
ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ని రద్దు చేస్తూ గతనెల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం బాండ్ల వివరాలను సీఈసీకి ఎస్బీఐ సమర్పించింది. పార్టీలకు నేతలు ఇచ్చిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం పబ్లిక్ డొమెన్లలో పెట్టింది.