Arvind Kejriwal Arrest (current news from India) : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం తీహార్ జైలు నుంచే ఆయన ప్రజలకు సందేశం పంపించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన భార్య సునీత సందేశాన్ని చదివి వినిపించారు. తన శరీరంలోని ప్రతీ రక్తపు బొట్టును దేశానికి అంకితం చేసినట్లు కేజ్రీవాల్ ఆ సందేశంలో పేర్కొన్నారు.
తన జీవితంలో ప్రతీ క్షణాన్ని దేశ సేవకే అంకితం చేశానని అన్నారు. జైళ్లో ఉన్నా బయట ఉన్నా ఇకపై దేశానికే తన జీవితం అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు అధికారులు తనతో దురుసుగా ప్రవర్తించారని కేజ్రీవాల్ ఆరోపించారు. కోర్టుకు తనను తరలిస్తున్న సమయంలో ఏకే సింగ్ అనే అసిస్టెంట్ కమిషనర్ తనతో చాలా దారుణంగా ప్రవర్తించారని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. తనకు కేటాయించిన సెక్యూరిటీ నుంచి ఆ పోలీసు అధికారిణి తొలగించాలని కోరారు. మరో వైపు ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు చేస్తున్న సేవలపై కేజ్రీవాల్ మరోసారి గుర్తుచేశారు.
ప్రభుత్వం అందిస్తున్న పరిహారం ఇప్పుడు ప్రజలకు అందుతుందో లేదోనని రాష్ట్రంలోని తల్లులు, అక్కాచెల్లెలు బాధపడుతున్నారని ఆందోళన చెందారు. ఈ విషయంలో తనను నమ్మాలని కేజ్రీవాల్ కోరారు. తాను కేవలం పోరాడడానికే పుట్టానని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయని అన్నారు. దీని కోసం తనకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని కోరారు. త్వరలో రాష్ట్ర ప్రజలకు తాను ఇచ్చిన హామీని నెరవేర్చుతానని.. తన కోసం ఆలయాలకు వెళ్లి దేవుడి ఆశీస్సులను తీసుకోవాల్సిందిగా కోరారు.
కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాం కేసులో గత రెండేళ్లుగా తనిఖీలు జరుగుతున్నప్పటికీ తన పార్టీ నేతలు అక్రమంగా నగదు బదిలీలు చేసినట్లు ఈడీ నిరూపించలేకపోయిందని అన్నారు. ఈ కుంభకోణంలో అసలు ఎంత డబ్బు దొంగిలించారు. అది ఎక్కడికి పోయింది అని అతిశీ ప్రశ్నించారు.
కేవలం ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. మరోవైపు 2022 నవంబర్ 9వ తేదీన ఈ కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డిని విచారణకు పిలిచినప్పుడు అసలు ఆయనను కేజ్రీవాల్ ఎప్పుడు కలవలేదని అన్నారు. కానీ ఆ మరుసటి రోజే ఈడీ శరత్ ను అరెస్ట్ చేసిందని అతిశీ అన్నారు.