CBI RAIDS ON MAHU MOITRA: దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వేళ దర్యాప్తు సంస్థలు బిజిబిజీగా ఉన్నాయి. ఓ వైపు ఈడీ.. మరోవైపు సీబీఐ సోదాల్లో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా పాత కేసులపైకి ఈ రెండు సంస్థలు దృష్టి సారించాయి. ఇందులోభాగంగా తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా నివాసంపై తనిఖీలు చేపట్టింది సీబీఐ.
శనివారం ఉదయం తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా నివాసంపై దాడులు చేసింది సీబీఐ. కోల్కతాలోని మహువా నివాసంతోపాటు ఇతర నగరాల్లో ఆమెకి చెందిన కార్యాలయాలపైనా సోదాలు జరుగుతున్నాయి. పార్లమెంటులో ప్రశ్నలు అడిడేందుకు డబ్బులు తీసుకున్నారంటూ మహువాపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదు మేరకు మహువాపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని లోక్ పాల్ ఆదేశించింది. ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచన చేసింది. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. రంగంలోకి దిగింది.
ఈసారి బెంగాల్ లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు మహువా మొయిత్రా. ఇప్పటికే అక్కడ ప్రచారంలో ఆమె నిగమ్నమయ్యారు. ఓ వైపు ర్యాలీలు, మరోవైపు రోడ్ షోలతో ఆమె బిజీగా ఉన్నారు. ఇంతలోనే సీబీఐ దాడులు చేయడం ఆమె ఆశ్చర్యపోయారు. కావాలనే తనపై కుట్ర జరగుతోందని ఆరోపించారు.
లోక్ సభలో అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు బిజినెస్ మేన్ దర్శన్ హీరానందాని నుంచి మహువా రెండు కోట్ల రూపాయలతోపాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపింది లోక్ సభ ఎథిక్స్ కమిటీ. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమేనని, సభా ధిక్కరణకు పాల్పడ్డారని తేల్చింది.
ఈ నివేదిక ఆధారంగా గతేడాది డిసెంబరులో స్పీకర్ ఓం బిర్లా.. మహువాపై బహిష్కరణ వేటు వేశారు. వెంటనే లోక్ సభలో ఆమె సభ్యత్వం రద్దైంది. దీన్ని మహువా తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే వ్యవహారానికి సంబంధించి ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ కూడా మహువా మొయిత్రాకు సమన్ల జారీ చేసింది.