International World Water Day 2024 Theme: మనిషి మనుగడకు గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో.. నీరు అంతే అవసరం. నీరు లేకపోతే మనిషికి జీవనం లేదు. అలాగని నీరు ఎక్కువైనా ప్రమాదమే. ఎంతవరకూ ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ.. మనిషిచేసే పనుల వల్ల ప్రకృతి ప్రకోపిస్తుంది. ప్రతిఏటా వర్షాకాలంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు పెరిగితే.. ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందుతున్నారు. ఇది వర్షాకాలంలో పరిస్థితి.
మరి వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవికాలం వచ్చిందంటే చాలు.. నీటి కోసం హలో లక్ష్మణా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ప్రత్యేకంగా ఏదో ఒక రాష్ట్రంలో ఉండే పరిస్థితి కాదిది. దేశమంతా ఇలాగే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీరు అందిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లతో పంపిణీ చేయడం కూడా కష్టంగా మారింది. అందుకు ఉదాహరణ ఇప్పుడు మనం చూస్తున్న బెంగళూరు. ఏప్రిల్ ఇంకా రాలేదు. అసలు సిసలైన వేసవిని చూడకముందే.. దాదాపు నెలరోజులుగా బెంగళూరు నీటి కరువును ఎదుర్కొంటోంది.
ఐటీ ఉద్యోగులకు ఇది కష్టకాలం. అక్కడ బ్రతకలేక, ఆఫీసులకు వెళ్లలేక నరకం చూస్తున్నారు. నలుగురు ఉన్న కుటుంబం రోజంతా నీటి అవసరాల కోసం రూ.500 ఖర్చు చేయాల్సిన దుస్థితి. సుమారు 80 లక్షల మంది జీవిస్తున్న బెంగళూరులో ఈ పరిస్థితి రావడానికి కారణం బోరుబావులు ఎండిపోవడమే. వర్షాకాలంలో నీటిని ఒడిసి పట్టుకుంటే ఇప్పుడీ పరిస్థితి ఉండకపోయేది. ఇంకుడు గుంతల గురించి అవగాహన పెంచి ఉంటే.. నీటి ఎద్దడి రాకపోయి ఉండేది.
Also Read: అడవుల రక్షణ అందరి బాధ్యత.. ప్రపంచ అటవీ దినోత్సవం
నీరుంటేనే ప్రకృతి బాగుంటుంది. ప్రకృతి బాగుంటే మనిషి బాగుంటాడు. ప్రకృతి సహకరిస్తేనే రైతన్న బాగుంటాడు. రైతన్న బాగుంటేనే.. మనం తినడానికి తిండి దొరుకుతుంది. నీరుంటేనే మన కనీస అవసరాలు తీరుతాయి. నీరుంటేనే అడవులు సురక్షితంగా ఉంటాయి. అడవులు పచ్చగా ఉంటేనే.. వర్షాలు సకాలంలో కురుస్తాయి. వర్షాలు పడితేనే నీటి కరవు పరిస్థితులు తగ్గుతాయి.
1993 నుంచి ప్రతి ఏటా మార్చి 22న ఐక్యరాజ్య సమితి ఏడాదికో థీమ్ ను పరిచయం చేస్తూ ప్రపంచ జల దినోత్సవం (World Water Day) నిర్వహిస్తోంది. ఈ ఏడాది 31వ జల దినోత్సవాన్ని శాంతి కోసం నీరు అనే థీమ్ తో జరుపుతోంది. స్థిరమైన మంచినీటి వనరుల నిర్వహణ, పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టింది. ఎందుకు నీటిని వృథా చేయడం, నేచర్ ఫర్ వాటర్, నీరు-వాతావరణ మార్పు, నీరు – ఉద్యోగాలు, వాటర్ ఫర్ లైఫ్ వంటి థీమ్స్ ను నిర్వహించింది.
Also Read: బెంగుళూరు ఖాళీ అయిపోతుందా?.. నీటి సమస్య ఎప్పటివరకంటే..?
ఈ ఏడాది శాంతి కోసం నీరు అనే థీమ్ ను చేపట్టింది. నీరు శాంతిని సృష్టించడంతో పాటు సంఘర్షణను కూడా రేకెత్తించగలదు. నీటి కొరత వచ్చినపుడు లేదా కలుషితమైనప్పుడు ప్రజలకు నీటి విలువ తెలుస్తుంది. మిగతా సమయాల్లో నీటిని వృథా చేస్తుంటారు. ఈ రోజు మనకు అవసరమైన నాలుగు చుక్కల నీటిని వాడుకుని.. రెండుచుక్కల నీటిని సేవ్ చేసినా.. భవిష్యత్ తరాలు నీటి కరువును చూసే పరిస్థితులు తగ్గుతాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయం. మీరు కూడా వృథాగా నీటిని వాడటం తగ్గించుకుంటేనే.. మీ పిల్లలు, వారి పిల్లలు కూడా నీటి ఎద్దడి నుంచి బయటపడుతారు. సేవ్ వాటర్.. సేవ్ నేచర్.. సేవ్ ఫ్యూచర్..