Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం. నెల రోజులుగా తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ఎక్కడో ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు జరిగితే.. ప్రధాన నిందితులు ఏపీ, తెలంగాణకు చెందిన వారే కావడం కలకలం రేపుతోంది. అందులోనూ, రెండు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ ప్రముఖులకు సన్నిహితులనే ప్రచారం మరింత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్ లను సీబీఐ అరెస్ట్ చేయగా.. లేటెస్ట్ గా ఈడీ సైతం వారిద్దరినీ అరెస్ట్ చేయడం కీలక పరిణామం. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ పై తీర్పు వచ్చే సమయంలో.. ఈడీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అరెస్ట్ చూపడం చూస్తుంటే.. లిక్కర్ కేసును వదిలేదేలే అన్నట్టు ఉంది దర్యాప్తు సంస్థల తీరు.
ప్రస్తుతం సీబీఐ అదుపులో ఉన్న బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్లను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో శరత్చంద్రా రెడ్డి, వినయ్బాబులను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది. విచారణ సమయంలో శరత్చంద్రారెడ్డి, వినయ్బాబు ఇచ్చిన సమాచారంతో అభిషేక్ బోయినపల్లి, విజయ్నాయర్లను లేటెస్ట్ గా ఈడీ తమ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, లిక్కర్ స్కాంలో అప్రూవర్గా మారిన దినేష్ అరోరా వాంగ్మూలాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు నమోదు చేసింది. సాక్షిగా మారిన నిందితుడి వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేశారు. అతను ఇచ్చిన వాంగ్మూలం లిక్కర్ కేసును కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని అంటున్నారు.
బోయినపల్లి అభిషేక్.. శరత్ చంద్రారెడ్డి.. తెలంగాణ, ఏపీని షేక్ చేస్తున్న పేర్లు ఇవి. అభిషేక్ వెనుక టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారనే ప్రచారం. బీజేపీ నేతలైతే ఎమ్మెల్సీ కవితపై నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. అటు, శరత్ చంద్రారెడ్డి ఏకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు కావడం హాట్ టాపిక్. ఇలా, ఢిల్లీ లిక్కర్ దందాపై సీబీఐ, ఈడీ సీరియస్ గా ఫోకస్ చేయడం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపణలు సృష్టిస్తోంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే టెన్షన్ చాలామందిలో కనిపిస్తోంది.