Supreme Court Rejects Kavitha Bail : ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లిన కవిత.. బెయిల్ కు అప్పీల్ చేసుకున్నారు. కవిత బెయిల్ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. ప్రస్తుతం ఈ కేసు మెరిట్స్ లోకి తాము వెళ్లలేమని స్పష్టం చేసిన ధర్మాసనం.. పిటిషన్ లోని అంశాలపై వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లోగా వాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్ట్ చేశారు. ఆ రాత్రంతా కవితను ఈడీ కార్యాలయంలోనే ఉంచిన అధికారులు మర్నాడు వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 23తో కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. ఈలోగానే ఇదే కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ.. ఆయన్ను కూడా కస్టడీకి కోరనుంది. కేజ్రీవాల్ ను త్రిసభ్య ధర్మాసనం ఈడీ కస్టడీకి అనుమతిస్తే.. కవిత, కేజ్రీవాల్ ను కలిపి ప్రశ్నించాలని ఈడీ భావిస్తోంది. వీరిద్దరినీ ఒకేసారి విచారిస్తే.. అసలు విషయాలు వెల్లడవుతాయని ఈడీ అనుకుంటోంది. ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లికి సుప్రీం ఇటీవలే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Also Read: కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? ఢిల్లీ సీఎం బాధ్యతలు చేపట్టేదెవరు?
కాగా.. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉండి.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ గతేడాది కవితతో చేసిన వాట్సప్ చాట్ అంటూ కొన్ని లీక్స్ చేశాడు. వాటిని కవిత సహా బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఆ తర్వాత మీరూ త్వరలోనే ఇక్కడికొస్తారంటూ ఒక లేఖ రాశారు. మూడురోజుల క్రితం.. తీహార్ క్లబ్ కు స్వాగతం అక్కా.. నెక్ట్స్ అరెస్ట్ కేజ్రీవాలే అని మరో లేఖ రాశాడు. ఇలా సుకేశ్ చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ ఇద్దరూ నిందితులుగా ప్రూవ్ అయితే తీహార్ జైలుకు వెళ్లక తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.