Yadadri Swarnagiri Temple : యాదాద్రి భువనగిరి జిల్లా.. యాదగిరిగుట్ట అనగానే.. వెంటనే గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి ఆలయం. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఇదీ ప్రధానమైన ఆలయం. ప్రతినిత్యం ఇక్కడికి భక్తులు విచ్చే.. ఆ లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని తరిస్తారు. ఇక్కడికి అత్యంత సమీపంలోనే మానేపల్లి హిల్స్ లో మానేపల్లి ట్రస్ట్.. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించింది. ఇప్పుడీ ఆలయం తెలంగాణ తిరుమలగా పేరొందుతోంది. 22 ఎకరాల విశాల ప్రాంగణంలో చేపట్టిన ఈ ఆలయంలో.. అద్భుతమైన శిల్పకళ భక్తులను కట్టిపడేస్తుంది.
ఈ ఏడాది మార్చి 6వ తేదీన శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేతులమీదుగా ఆలయ ప్రారంభోత్సవం, ఆ శ్రీనివాసుడి ప్రాణ ప్రతిష్ట ఘనంగా జరిగాయి. యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో నిర్మించిన ఆలయంలో.. 5 అంతస్తుల విమాన గోపురంతో గర్భాలయం, 40 అడుగుల ఎత్తైన రథం, 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ విగ్రహం, శ్రీలక్ష్మీ నారసింహస్వామి, వకుళమాత, భూ వరాహస్వామి వార్ల ఉప ఆలయాలతో పాటు.. 12 అడుగుల ఎత్తైన శ్రీవారి విగ్రహమూర్తి భక్తులను ముగ్ధమనోహరులను చేస్తుంది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవమైన ఆ శ్రీనివాసుడు.. సాక్షాత్తు మన తెలంగాణలో కొలువుదీరడం ఇక్కడి భక్తుల అదృష్టం. మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపీకృష్ణ కలిసి నిర్మించిన ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు. ఆలయంలో ప్రాచీన శిల్ప ఆకృతులను చెక్కించారు. పల్లవ, చోళ, చాళక్య, విజయనగర, నాయక శిల్ప కళను తీర్చిదిద్దారు. స్వాగత తోరణంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహ రూపం, శంఖుచక్రాలు, రామానుజాచార్యుల విగ్రహాలను చెక్కారు. స్వర్ణగిరి ఆలయానికి వెళ్లే ఈ మార్గానికి రామానుజ మార్గం అని నామకరణం చేశారు.
Also Read : చింతలు తీర్చే దైవం.. మాచర్ల చెన్నకేశవుడు..!
తిరుమలలోని అలిపిరి మెట్టు వద్ద శ్రీవారి పాదపద్మాలు ఎలా అయితే మనకు దర్శనమిస్తాయో.. ఇక్కడ స్వర్ణగిరి మొదటి మెట్టు వద్దద కూడా శ్రీవారి పాదాలను ప్రతిష్టించారు. ఆ పాదాలకు ఇరువైపులా జయవిజయ ద్వారపాలకులు ఉంటారు. శిలామయ తోరణాలపై బ్రహ్మ, శివుడు సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటే శిలలు కనిపిస్తాయి.
స్వర్ణగిరి చేరుకోగానే.. 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం దర్శనమిస్తుంది. పూర్వం మన రాజులు తమ విజయాలకు ప్రతీకగా ఇలాంటి ఏకశిలా స్తంభాలను స్థాపించేవారు. స్వామివారిపట్ల మానేపల్లి కుటుంబానికి ఉన్న భక్తి, దాతృత్వం, ఔదార్యానికి ప్రతీకగా ఈ మానేపల్లి విజయ స్తంభాన్ని ప్రతిష్టించారు. అక్కడి నుంచే ఆలయ రాజగోపురం కనిపిస్తుంది. గోపురం అంటే.. పిడుగుపార్ల నుంచి పురమును రక్షించేది అని అర్థం. గో అంటే ఆవు, వేదాలు, దేవతలని అర్థం. అందుకే ఆలయానికి వెళ్లినపుడు గోపురానికి నమస్కరించి ఆలయంలోకి ప్రవేశించాలి.
స్వర్ణగిరి దేవాలయంలో నాలుగు గోపురాలను నిర్మించారు. వీటికి నాలుగు పేర్లను పెట్టారు. ప్రధాన తూర్పు రాజగోపురానికి త్రైలోక్య మల్ల రాజగోపురం, దక్షిణ రాజగోపురానికి త్రిభువన మల్ల రాజగోపురం, పశ్చిమ గోపురానికి – భువనైక మల్ల రాజగోపురం, ఉత్తర గోపురానికి – రాయ గజకేసరి రాజగోపురం అని నామకరణం చేశారు.
Also Read: మార్చి 31 నుంచి మీనరాశిలో శుక్రుని సంచారం.. ఈ 3 రాశుల వారికి లాభాలు..
సకల దేవతలు కొలువై ఉన్నట్లుగా కనిపించే ఆలయ ప్రాంగణంలో క్షీరసాగర మథనం, శ్రీనివాస కల్యాణం, రంగనాథుని విగ్రహం, 61 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి. అలాగే 10 హస్తాలతో భక్తులను అనుగ్రహించే శ్రీ మదనగోపాల కృష్ణస్వామి ఆలయం ఉంది. శ్రీవారి ఘంటా మండపంలో 6 అడుగుల ఎత్తు, 150 కేజీల కాంస్యంతో చేసిన జయ గంట కనిపిస్తుంది. అలాగే విమాన వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా స్థాపించిన మనోభీష్ట ఫలకంపై భక్తులు తమ కోరికలను రాసి.. తమ సంకల్పాన్ని చెప్పి ఆ జయగంటను మోగించి శ్రీవారిని దర్శించుకుంటారు.
ఇక ఇక్కడ నిర్మించిన పుష్కరిణి.. ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. దీనికి వేదపుష్కరిణి అని పేరు పెట్టారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు వేద పుష్కరిణి చుట్టూ కూర్చుని ప్రశాంతంగా సమయాన్ని గడుపుతారు. శ్రీవారి నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. అలాంటి స్వర్ణగిరి ఆలయాన్ని మీరూ ఓసారి దర్శించండి..