Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశంలో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే. గతంలో అరెస్ట్కు ముందు కొంతమంది ముఖ్యమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు మాజీ ముఖ్యమంత్రులు వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు.
దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, కలర్ టీవీల కొనుగోళ్లలో అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత, టీచర్ నియామాకాల్లో అక్రమాలపై హర్యానా మాజీ ఓం ప్రకాశ్ చౌతాలా, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రులు మధు కోడా మైనింగ్ కేసులో, హేమంత్ సోరెన్ భూ కుంభకోణం కేసుల్లో అరెస్ట్ అయ్యారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అరెస్ట్పై బలమైన సంకేతాలు అందినా పదవిని వదులుకోలేదు. చివరి వరకు న్యాయపోరాటం చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ 9సార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన విచారణకు హాజరుకాలేదు. ఎందుకంటే అరెస్ట్ను ముందే ఊహించారు. అందుకే ఈడీ తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ ఊరట లభించలేదు. అరెస్ట్పై రక్షణ కల్పించడం సాధ్యంకాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గురువారం రాత్రి అత్యవసరంగా ఈ పిటిషన్పై విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టులోకి రాకముందే అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిగే ఛాన్స్ ఉంది.
ఢిల్లీలో శుక్రవారం కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తే పరిస్థితేంటి? అనే చర్చ జరుగుతోంది. ఆ పరిస్థితులు ఎదురైతే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా? ఇదే ఇప్పుడు కీలక అంశంగా మారింది. అలా జరిగితే ఢిల్లీ సీఎం బాధ్యతలు ఎవరు చేపడతారనే చర్చ నడుస్తోంది. కేజ్రీవాల్ భార్య సునీతా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. అధికారిగా పాలనాపరమైన అనుభవం ఉంది. అలాగే కేజ్రీవాల్ కేబినెట్లోని మంత్రులు సౌరబ్ భరద్వాజ్, ఆతిశీ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
Also Read: నేడు కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ.. 10 రోజుల కస్టడీ కోరే అవకాశం..
అరవింద్ కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఆయనే పార్టీకి కన్వీనర్గా ఉన్నారు. 3 పర్యాయాలు ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో పంజాబ్లో ఆప్ అధికారం దక్కించుకుంది. ఇప్పుడు దేశంలో మూడో పెద్ద పార్టీ ఆప్. సార్వత్రిక ఎన్నికలకు ముందుకు కేజ్రీవాల్ అరెస్ట్ కావడం ఆప్కు గట్టి దెబ్బే.
కేజ్రీవాల్ జైలులో ఉంటే పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రశ్నార్థంగా మారింది. ఆప్లో నంబర్ టూగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై జైలులో ఉన్నారు. కేజ్రీవాల్ కేబినెట్లో మంత్రిగా చేసిన సత్యేందర్ జైన్ మరో కేసులో జైలు పాలయ్యారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న ఆయనకు ఇటీవల కోర్టు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇలా వరుస ఎదురుదెబ్బలు ఆప్కు తగిలాయి. చివరికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు దారితీశాయి.