IPL to introduce Smart Replay System: రోజురోజుకి టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రపంచం ఉరకలెత్తుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ లోకి కూడా కొత్త టెక్నాలజీ స్మార్ట్ రీప్లే సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు రన్ అవుట్లు, బౌండరీ లైన్లు, సిక్సర్లు, క్యాచ్ లు ఇవన్నీ చూడాలంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సరిపోవడం లేదు.
ఈ తలనొప్పి లేకుండా స్మార్ట్ రీప్లే సిస్టమ్ ద్వారా రివ్యూలు, రిప్లేలకు సంబంధించిన నిర్ణయాలు వేగంగా మరింత పారదర్శకరంగా తీసుకునే అవకాశం ఉంది. దీనిని కొత్తగా ఈ సీజన్ నుంచి అమలు చేస్తున్నారు.
ఒకప్పుడు థర్డ్ అంపైర్ ఏం చేసేవాడంటే.. టీవీ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ను సంప్రదించేవాడు. తను హాక్ ఐ ఆపరేటర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని థర్డ్ అంపైర్కు అందజేసేవాడు. దీంతో థర్డ్ అంపైర్ అటు తిప్పి, ఇటు తిప్పి, ఎవరికి అర్థం కానట్టు తిప్పి ఏదొకటి చెప్పేవాడు. ఇక నుంచి ఆ సమస్య లేదు. ప్రస్తుతం ఆ టీవీ బ్రాడ్కాస్ట్ డైరెక్టర్ వ్యవస్థ ఎగిరిపోయింది.
Also Read: ధనాధన్ ఐపీఎల్ పండుగొచ్చింది.. నేడే ఘనంగా ప్రారంభం
కొత్త సిస్టమ్ ద్వారా థర్డ్ అంపైర్ దగ్గరే ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు ఉంటారు. ఇంతకుముందులా ట్రయాంగిల్ సిరీస్ ఉండదు. నీ ముక్కెటు అంటే చుట్టూ చూపించడం ఉండదు. గ్రౌండ్లో 8 హైస్పీడ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి తీసే వీడియోలు బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేస్తాయి. థర్డ్ అంపైర్ కోరుకున్న కోణాల్లో ఫొటోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.దీంతో భిన్న కోణాల్లో వచ్చిన బంతిని పరిశీలించి కచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇది ఎల్బీడబ్ల్యూల విషయంలో ఎలా పనిచేస్తుందో తెలీదు. కానీ బౌండరీ దగ్గర క్యాచులు, వికెట్ కీపర్ పట్టే క్యాచులు, స్టంపింగ్, బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ బంతిని ఆపే సమయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు షార్ప్ గా పనిచేస్తుందని అంటున్నారు.
ఇక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత సక్సెస్ అయితే, టీ20 ప్రపంచ కప్ లో కూడా ఏర్పాటు చేస్తారని అంటున్నారు. బీసీసీఐ ఇప్పటికే దీనిపై వర్క్ షాప్ నిర్వహించింది.