Huge Donation to Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం.. శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న ఆ ఏడుకొండలు ప్రతినిత్యం వేలమంది భక్తుల గోవింద నామస్మరణతో మారుమ్రోగుతాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ తోచినంత కానుకలను సమర్పించుకుంటారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశాడు. అగర్వాల్ ఇండెక్స్ పర్నస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. SV ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళమిచ్చింది. ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర విరాళం డీడీని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.
కాగా.. తిరుమలలో ప్రస్తుతం వార్షిక తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవరోజైన గురువారం శ్రీకృష్ణస్వామివారు రుక్మిణీ సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులయ్యారు. పుష్కరిణిలో మూడుసార్లు విహరించి.. భక్తులకు అభయమిచ్చారు. నేడు మలయప్పస్వామివారు శ్రీభూ సమేతంగా.. తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై తిరుమాఢవీధుల్లో ఊరేగిన అనంతరం.. కోనేటిలోని తెప్పపై వివహరిస్తారు.
మార్చి 24న తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి వేడుక జరగనుంది. రెండ్రోజులు ఘనంగా జరిగే ఈ వేడుకకు విచ్చేసే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. 24వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ, 25న ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ మాత్రమే అనుమతించనున్నట్లు టిటిడి స్పష్టం చేసింది.
Also Read: శుక్రవారం శివుని పుత్రికకు పూజ.. మానసాదేవి చరిత్ర తెలుసా..!
పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం, త్రాగునీటిని అందిస్తారు. అలాగే అందుబాటులో ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బందిని ఉంచుతారు. గుండె, శ్వాసకోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదని టిటిడి తెలిపింది. శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి వేడుకకు వచ్చే భక్తులు.. కర్పూరం, అగ్గిపెట్టెలు, ఇతర వంట సామాగ్రికి తీసుకురావొద్దని తెలిపింది.
కాగా.. తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనార్థం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గురువారం స్వామివారిని 60,845 మంది భక్తులు దర్శించుకుని కానుకలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.10 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.