Ruturaj Gaikwad Appointed As CSK New Captain: చాలా రోజుల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ ఒక ట్వీట్ చేశాడు. త్వరలోనే మీకొక కొత్త విషయం చెబుతానని అన్నాడు. తర్వాత తను కూడా ఏమీ మాట్లాడలేదు. జనం కూడా మరిచిపోయారు. కానీ ప్రస్తుతం ఒక్కరోజులో ఐపీఎల్ ప్రారంభం అవుతుందనగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేమిటంటే ఇన్నాళ్లూ సీఎస్కే సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్న మహేంద్రసింగ్ ధోనీని కాదని, తన ప్లేస్ లో యువ క్రికెటర్ రుతురాజ్ గ్వైక్వాడ్ ఉంటాడని సింపుల్ గా చెప్పేసింది.
2024 ఐపీఎల్ ట్రోఫీ ఫొటో షూట్ కు గైక్వాడ్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమం జరిగిన కాసేపటికి రుతురాజ్ కు కెప్టెన్సీని ధోనీ అప్పగించాడని సీఎస్కే ట్వీట్ చేసింది. మరిప్పుడు ధోనీ పరిస్థితేమిటి? ఆడతాడా? లేదా? కీపింగ్ చేస్తాడా? లేకపోతే మెంటర్ గా ఉంటాడా? జట్టులోనే రోహిత్ శర్మలా ఉండి, గైక్వాడ్ కి గైడ్ గా ఉండిపోతాడా? అని అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. ఓ కామెంట్లు పెట్టేస్తున్నారు.
ఐపీఎల్ 2019 సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే తరఫున వచ్చాడు. అప్పుడు ఒక్క అవకాశం రాకపోయినా అలాగే ఓపికపట్టి బెంచ్ మీదే కూర్చున్నాడు. అయితే తర్వాత ఏడాది చూసినా ఎక్కువ అవకాశాలు రాలేదు.
2021లో మాత్రం అవకాశాలు వచ్చాయి. అప్పుడు 16 మ్యాచ్ లు ఆడి సీఎస్కే టాప్ స్కోరర్ గా నిలిచాడు. 635 పరుగులు చేశాడు. 2022 సీజన్ లో కూడా 388 పరగులు చేశాడు. ఆ జట్టు తరఫున ఇవే అత్యధిక పరుగులుగా చెప్పాలి. అంతేకాదు జట్టు విజయాల్లోనే కాదు సీఎస్కే ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
Also Read: కెప్టెన్గా తప్పుకున్న ధోనీ.. చెన్నై కొత్త సారథి రుతురాజ్ గైక్వాడ్..
ఇక 2023కి వచ్చేసరికి 16 మ్యాచ్ ల్లో 590 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఆ సీజన్ మొత్తమ్మీద అత్యధిక పరుగులు చేసిన డేవన్ కాన్వే (672) తర్వాత తనే నిలిచాడు. ఇప్పుడు ఏకంగా లెజండరీ క్రికెటర్ ధోనీ తర్వాత కెప్టెన్ అయిన ఘనత సాధించాడు. తను సీఎస్కేలో చేరిన తర్వాత రెండేళ్లు బెంచ్ కే పరిమితమైన సహనం కోల్పోలేదు. అదే తన విజయ రహస్యమని అంటున్నారు. నేటి యువత అందరూ గైక్వాడ్ నుంచి అదే నేర్చుకోవాలని అంటున్నారు.
తనింతవరకు 52 మ్యాచ్ లు ఆడి 1797 పరుగులు చేశాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం యథాతథంగా మ్యాచ్ లు ఆడతాడు. రోహిత్ శర్మ తరహాలోనే తన పాత్ర పరిమితమైపోయిందని అంటున్నారు. సీనియర్లు అందరూ తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.