Election Bonds Data: ఎలక్టోలర్ బాండ్స్ విషయంలో భారతీయ స్టేట్ బ్యాంక్ కీలక ముందడుగు వేసింది. ఎలక్టోరల్ బాండ్ల పూర్తి డేటాను SBI గురువారం ఎన్నికల సంఘానికి అందించింది. ఎలక్టోరల్ బాండ్ల నెంబర్స్ ను గతంలో ఈసీకి SBI అందించలేదు. దీంతో సుప్రీంకోర్టు SBIపై సీరియస్ అయి.. మార్చి 21వ తేదీలోగా నెంబర్లతో సహా పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీకీ SBI ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లను అందించింది. SBI అందించిన ఈ డేటా ద్వారా.. ఏ దాత ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత విరాళాలు అందించారో పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి. అయితే బ్యాంకు అందించిన వివరాలను ఎన్నికల సంఘం త్వరలోనే ఈసీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయనుంది.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎన్నికల కమిషన్ కు అందజేసినట్లు ఎస్బీఐ గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఎస్బీఐ అందించిన డేటాలో URN నంబర్, జర్నల్ తేదీ, కొనుగోలు చేసిన తేదీ, గడువు తేదీ, కొనుగోలుదారు పేరు, బాండ్ నంబర్, డినామినేషన్లు, ఇష్యూ బ్రాంచ్ కోడ్, స్థితితో సహా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి వివరాలు కూడా ఉన్నాయి.
Also Read: Lok Sabha Elections 2024: కేంద్రానికి షాక్ ఇచ్చిన ఈసీ.. వికసిత భారత్ సందేశాలు ఆపండి
ఎస్బీఐ ఇప్పటి వరకు రెండు జాబితాలను ఈసీకి అందించింది. ఎస్బీఐ అందించిన ఈ డేటాను ఎన్నికల సంఘం మార్చి 14న తన వెబ్ సైట్ లో పొందుపరిచింది. ఎస్బీఐ ఈసీకి అందజేసిన మొదటి డేటాలో దాతల పేర్లు, బాండ్ల పేర్లు, వాటిని కొనుగోలు చేసిన తేదీలు ఉన్నాయి. అయితే ఆ డేటాలో యూనిక్ నెంబర్ లేకపోవడంతో ఆ డేటాను కూడా ఈసీకి అందించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐకి ఆదేశించింది. దీనిపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎస్బీఐకి మార్చి 21వ సాయంత్రం 5 గంటలులోగా ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లను అందించాలని పేర్కొంది. దీంతో ఎస్బీఐ పూర్తి సమాచారాన్ని ఈసీకి అందించింది.