STOCK MARKET TODAY GAIN : వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి స్పష్టమైన సంకేతాలతో బాంబే స్టాక్ మార్కెట్ జోరందుకుంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలం సంకేతాలు మార్కెట్ ను తాకాయి. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది.
గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచి బీఎస్ఈ, నిఫ్టీ సూచీలు జోరు కొనసాగించాయి. తొలుత 500 పాయిట్లు పెరిగిన బీఎస్ఈ, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో మొదలైంది. మార్కెట్ ముగిసేవరకు అదే దూకుడు కంటిన్యూ అయ్యింది. చివరకు మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 172 పాయింట్ల లాభంతో 22 వేల ఎగువన స్థిరపడింది.
డాలర్ తో రూపాయి మారకం విలువ 83.13 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్ టెల్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ పేర్లు మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్,టాటా మోటార్స్ కంపెనీల పేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
ఇంతకీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం గత రాత్రి ముగిసింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రతికూల పరిస్థితులేవీ లేకపోతే జూన్ నుంచి వడ్డీ రేట్లలో కోత ఉంటుందని ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. 2024 ముగిసే వరకు మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తామన్నారు. ప్రస్తుతానికి మాత్రం కీలక వడ్డీ రేట్లను యథాతధంగానే ఉంచారు. వడ్డీరేట్లను 5.25 నుంచి 5.50 శాతంగానే కొనసాగించింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ పై పడింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు పాల్పడ్డారు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, మెటల్ షేర్లు భారీగా పెరిగాయి.