NDSA TEAM INTERACTION TO ENGINEERS AT HYDERABAD: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల టీమ్ బిజిబిజీగా ఉంది. మూడురోజుల టూర్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమైన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిపుణుల కమిటీ గురువారం ఎర్రమంజిల్ లోని జలసౌధలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో సమావేశమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజ్ డిజైన్ల వివరాలపై ఆరా తీసింది. వీటిని రూపొందించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో బుధవారం సమావేశమైంది. ఇంకా వివరాల కోసం గురువారం ఈ భేటీని కంటిన్యూ చేసింది. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లతో ప్రత్యేకంగా సమావేశమైంది. డిజైన్లకు సంబంధించిన డీటేల్స్ తీసుకుంది. అలాగే ఆనకట్టల నిర్వహణ బాధ్యతలు చూసే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం నుంచి సమగ్ర వివరాలను కోరింది.
ముఖ్యంగా 2019 నుంచి తీసుకున్న చర్యలు, చేపట్టిన తనిఖీల వివరాలు ఇవ్వాలని అధికారులను కోరింది కమిటీ. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఏయే కారణాలతో మార్చాల్సి వచ్చిందని ఇంజనీర్లను ప్రశ్నించింది. తొలిరోజు నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీరు ఇన్ చీఫ్ మురళీధర్, ప్రస్తుతం ఈఎన్సీ అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరిరాంతోపాటు గతంలో డిజైన్స్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన నరేందర్ రెడ్డి, చంద్రశేఖర్లతో మాట్లాడింది కమిటీ.
గతంలో కాళేశ్వరం బ్యారేజ్ పనుల బాధ్యతలు చూసిన నల్లా వెంకటేశ్వర్లు కూడా కమిటీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనపై పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. డీపీఆర్ లో ఏముందో చూసి చెప్పాలని కోరింది. సీకెంట్ ఫైల్స్ ను ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? వైఫల్యాలు ఏమైనా కనిపించాయా? అలాగే నిర్మాణ స్థలం మార్చడానికి కారణం ఏంటి? అక్కడ ప్రాంతాన్ని పరిశీలించారా? వరదలు వచ్చినప్పుడు గేట్ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను ఎవరు ఖరారు చేశారు? గేట్ల నిర్వహణకు బాధ్యులెవరు ఇలా అనేక ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత ప్రాజెక్టులోని కాంట్రాక్టుల ప్రతినిధులతో సమావేశం కావాలని నిర్ణయించింది నిపుణుల కమిటీ.