Chandrababu Pawan Kalyan Meet(political news in ap) : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసానికి జనసేనాని వెళ్లారు. ఇరువురు నేతలు ఎన్నికల వ్యూహంపై చర్చించారని తెలుస్తోంది. దాదాపు 75 నిమిషాల పాటు వివిధ అంశాలపై సమాలోచనలు చేశారు.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే 128 మంది అభ్యర్థులను టీడీపీ చీఫ్ ప్రకటించారు. మరో 16 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని తెలుస్తోంది.
జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఆ స్థానాల కేటాయింపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఇప్పటికే ఉత్కంఠ వీడింది. జనసేనాని పిఠాపురం నుంచి బరిలోకి దిగనున్నారు. అక్కడ టీడీపీ టిక్కెట్ ఆశించిన వర్మ తొలుత అసమ్మతి గళం వినిపించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడిన తర్వాత చల్లబడ్డారు.
జనసేనకు రెండు ఎంపీ స్థానాలను చంద్రబాబు కేటాయించారు. ఇప్పటికే కాకినాడ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేనకు మచిలీపట్నం కూడా ఇచ్చారు. ఇక్కడ అభ్యర్థిని పవన్ కల్యాణ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Also Read: దేవాన్ష్ బర్త్ డే.. నారా కుటుంబం తిరుమలలో సందడి..
మరోవైపు బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే 6 లోక్ సభ నియోజకవర్గాల్లో బరిలోకి దిగనుంది. టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎంపీ స్థానాలకు ఇంకా అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించలేదు.
ఇప్పటికే వైసీపీ 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. 24 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఒక్క అనకాపల్లి స్థానాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంపైనా ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది.