SONIAGANDHI ANGRY ON MODI GOVT (current news from India ): మోదీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రజాస్వామ్యం బతకడం కష్టమన్నారు. పార్టీల ఖాతాలను స్థంభింప చేయడం ఒక్క కాంగ్రెస్ కు మాత్రమేకాదని, ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా వర్ణించారు సోనియా. ఎలక్టోరల్ బాండ్ల వల్ల లాభపడింది కేవలం బీజేపీ మాత్రమేనన్నారు.
గురువారం ఉదయం పార్టీ ఆపీసులో అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనియాగాంధీ.. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరగాల్సిందేనని స్పష్టంచేశారు.ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ 56శాతం నిధులు వస్తే.. కాంగ్రెస్ కి కేవలం 11శాతం మాత్రమే వచ్చిందన్నారు. వేల కోట్ల రూపాయలు బీజేపీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు సోనియాగాంధీ.
మరోవైపు ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ కూడా ఎన్డీయే సర్కార్ పై మండిపడ్డారు. ఎన్నికలకు రెండు నెలల ముందు ఇలా చేయడం దారుణమని ఆందోళన వ్యక్తంచేశారు. బ్యాంకు ఖాతా స్థంభిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. ఇది ముమ్మాటికీ నేరపూరిత చర్యేనని చెప్పుకొచ్చారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు రాహుల్ గాంధీ. ఇండియాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమనేది అబద్ధమన్నారు. దేశంలో 20శాతం ఓటర్లు మాకు మద్దతుగా ఉన్నారని, కానీ మేము రెండు రూపాయలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా అదేస్థాయిలో మోదీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎవరు లబ్ది పొందారో అందరికీ తెలుసన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే పార్టీ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.