KCR: తెలంగాణలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళుతోంది. తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో విజయఢంకా మోగించి ఉత్సాహంగా ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేసేందుకు గులాబీబాస్ కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవుతారు.
సమావేశంలో కీలక రాజకీయ అంశాలను కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుందని సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఏవిధంగా ముందుకెళ్లాలన్న విషయంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను ఎలా నిర్వహించాలన్నదానిపై నేతలతో చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలన్న విషయంపైనా చర్చించనున్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనేదానిపై టీఆర్ ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపైనా చర్చ జరగవచ్చు. బీజేపీపై ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి? కాంగ్రెస్ విషయంలో ఎలాంటి వైఖరి ఉండాలనే దానిపై నేతలకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.