Alert for Tirumala Devotees: తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య సూచన చేసింది. అలిపిరి మెట్లమార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఎలుగుబంటి సంచారం కనిపించడం.. కలకలం రేపింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలో మార్చి 19, మంగళవారం రాత్రి సుమారు 12.45 గంటల సమయంలో ఎలుగుబంటి ట్రాప్ కెమెరాకు చిక్కింది. నడకమార్గానికి అతి సమీపంగా వెళ్తున్న ఆ ఎలుగును చూసి అధికారులు షాకయ్యారు. ఈ క్రమంలో నడిచివెళ్లే భక్తులను అప్రమత్తం చేశారు.
గాలిగోపురం నుంచి మోకాళ్లమిట్ట వరకూ భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. అలాగే ప్రతి గుంపుతో ఇద్దరు విజిలెన్స్ సిబ్బంది, చేతికర్రలు ఇచ్చి పంపుతున్నారు. కాగా.. ఎలుగుబంటి మెట్లమార్గంకు అతిసమీపంగా వచ్చిందని, పూర్తిగా ఆ మార్గంవైపు రాలేదని తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలోనే చిరుతపులులు కూడా కనిపించాయి. గతేడాది ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన ఘటన సంచలనమైంది. టిటిడి భక్తులను పట్టించుకోవట్లేదన్న విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి నడకదారి భక్తులకు టిటిడి చేతికర్రల్ని అందజేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య భక్తులను నడకదారికి అనుమతిస్తున్నారు. టిటిడి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: హోలీ నాడు చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారు బీ కేర్ఫుల్..
కాగా.. ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా అధికారులు విడుదల చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేయనున్నారు. మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మార్చి 25 ఉదయం 10 గంటల నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.