AP Elections (Andhra news updates): ఏపీలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లపై వేటుపడింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మొత్తం 46 మంది వాలంటీర్లు , కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొంటే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులపైనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 392 ఫిర్యాదులను పరిష్కరించామని వివరించారు.
ఏపీలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉందని సీఈవో తెలిపారు. ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్న కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. తమ కార్యక్రమాల అనుమతి కోసం రాజకీయ పార్టీలు సువిధ యాప్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభలో జరిగిన పరిణామాలపైనా సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వివరణ ఇచ్చారు. భద్రతా లోపాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులను కేంద్రానికి పంపామని తెలిపారు. ఈ అంశం హోంశాఖ పరిధిలో ఉందని చెప్పారు.
Also Read: పిఠాపురం సీటుపై పవన్ వ్యాఖ్యలు.. టీడీపీ వర్మ కౌంటర్..
ఎన్నికల నిబంధనలపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని సీఈవో తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తుందన్నారు. ప్రభుత్వ భవనాలపై నాయకుల ఫోటోలు , ఫ్లెక్సీలు , బోర్డులు తొలగించాలని ఆదేశించామన్నారు. అలాగే ప్రజాప్రతినిధులతో ప్రభుత్వ ఉద్యోగులు తిరగకూడదని స్పష్టంచేశారు.
ప్రజలు సీ విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయవచ్చని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. దీని ద్వారా ఫోటోలు, వీడియోలు కూడా పంప వచ్చని సూచించారు. ఆ ఫిర్యాదులపై 100 నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటామని వివరించారు. లక్షా 99 వేల పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు తొలిగించామని తెలిపారు. 385 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 39 లక్షల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పవన్ కల్యాణ్ గాజు గ్లాసు చూపించిన ప్రకటనను పరిశీలిస్తామన్నారు.