Pithapuram Ex MLA SVSN Varma (latest political news in Andhra Pradesh): పీఠపురం సీటుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే ఆయన స్థానంలో తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కాకుండా జనసేన తరపున పిఠాపురం నుంచి వేరే వారు పోటీ చేస్తే తాను కూడా పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వర్మ చేసిన వ్యాఖ్యలపై జనసేన, టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది.
రానున్న ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానం నుంచి పోటీలో లేకుంటే టీడీపీ తరపున తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ స్థానం నుంచి కాకుండా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే తాను తప్పుకుండా పొత్తులో భాగంగా పిఠిపురం స్థానంలో పోటి చేస్తానని వెల్లడించారు. తాజాగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. దాదాపు 20 సంవత్సరాలగా టీడీపీకోసం పనిచేస్తున్నాని తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా తన స్థానాన్ని జనసేన కోసం కేటాయించడం జరిగిందన్నారు. ఎంతో బాధతో తన స్థానాన్ని వదులుకున్నానన్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయానికి తాను కృషి చేస్తానని తెలిపారు. అయితే వర్మ చేసిన ఈ వ్యాఖ్యలతో జనసేనకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.
మంగళవారం తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడీయా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పిఠాపురం, కాకినాడ స్థానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పెద్దలు తనకి లోక్ సభ, శాసనసభ స్థానాల్లోనూ పోటీ చేయమన్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే తనకు మాత్రం శాసనసభకు పోటీ చేయడమే ఇష్టం అని తెలిపారు. దీని కారణంగానే తాను పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ముందు రాష్ట్రానికి పని చేస్తానని తర్వాత దేశానికి పనిచేస్తానని పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు లోక్ సభకు పోటీ చేయాలని కోరితే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ తన స్థానంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు.
Also Read:Ustaad Bhagat Singh : ఉస్తాద్ డైలాగ్స్ పై పవన్ రియాక్షన్.. “ఆ డైలాగ్స్ అందుకే చెప్పా”
పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురం స్థానం నుంచి.. పార్టీ పెద్దల నిర్ణయిస్తే తనకు బదులుగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించికున్నాయి. వీరు ఇరువురు చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం పిఠాపురం స్థానంపై రాజకీయ వేడి మొదలైంది. పవన్ కోసమే తాను సీటు వదులుకున్నానని తన స్థానంలో వేరు వారు పోటీ చేస్తే మాత్రం తాను తప్పుకుండా పోటీకి సిద్ధమవుతానని వర్మ కుండబద్దలు కొట్టారు. మరి వర్మ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అటు టీడీపీ, జనసేన నేతల్లో ఆందోళన మొదలైంది.