రాజకీయంగా చైతన్యం కలిగిన ఓటర్లుండే పార్లమెంటు నియోజకవర్గం ఏలూరు. బౌగోళికంగా విభిన్నంగా ఉండే ఈ పార్లమెంటులో ఇప్పుడు రాజకీయం మరింత విభిన్నంగా సాగుతోంది. ఏలూరు పార్లమెంట్లో ఒకటి రెండు పార్టీలకు మాత్రమే అవకాశం ఉంటుందనే భావన నుంచి సరికొత్త మార్పులు చూడబోతున్నామనే విధంగా ఈసారి ఎన్నిక జరగబోతుందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం గతంలో ఎప్పుడు లేని విధంగా ఏలూరు పై కాషాయపార్టీ ప్రభావం చూపడమే. పార్లమెంటు పరిధిలోని ప్రజలను ఇప్పటికే మెప్పించి విజయం సాధించడానికి సిద్దంగా ఉన్నామనే ఉత్సాహం అక్కడి బిజేపి శ్రేణుల్లో కనిపిస్తోందంటే అక్కడ ఎన్ని మార్పులు జరిగాయనేది ఊహించొచ్చు.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏలూరు పార్లమెంటు సీటు ఇపుడు ఓటర్ల దృష్టినే కాదు .. అన్ని రాజకీయపార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే పొత్తులో భాగంగా టీడీపీ సైతం ఇదే సీటు పై కర్చీఫ్ వేసిందట. ఏలూరు పార్లమెంట్ లో టీడీపీ గెలుపు అవకాశాలు ఎక్కువ అని ప్రచారం జరుగుతోంది. నర్సాపురం బిజెపి తీసుకొని ఏలూరు పార్లమెంట్ టిడిపికి ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారు టీడీపీ అధినేత. అయితే ఈక్కడ గత పదేళ్లుగా బీజేపీ బలోపేతానికి కృషి చేసింది తపన ఫౌండేషన్ చైర్మెన్ యువకుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి. ఆయన ఆర్ధికంగా బలంగా ఉండటంతో పాటుగా పలు సేవ కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఏలూరు పార్లమెంట్ లో తపన చౌదరి పోటీలో ఉంటారన్న ప్రచారం బలంగా ఉంది. బీజేపీ అధిష్టానంసీటు ఇవ్వడమే ఆలస్యం గెలుపు సాధించేందుకు సిద్ధమంటున్నారు బీజేపీ కార్యకర్తలు.
Also Read: నేడు, రేపు కోస్తాంధ్రకు భారీ వర్షసూచన.. తెలంగాణకు ఎల్లో అలర్ట్
మరోవైపు ఏలూరు పార్లమెంట్ లోని రెండు అసెంబ్లీ స్థానాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేకపోతుంది కూటమి. ఏలూరు పార్లమెంట్ లో కైకలూరు , పోలవరం నియోజకవర్గాలకు సంబంధించి ఏ పార్టీ బరిలో ఉంటుందనేది ఇంకా ప్రకటించకపోవడం కన్య్ఫూజన్కు దారి తీస్తుంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు సైతం సీటు తమదే అంటూ ప్రచారం చేయడంతో పాటుగా మూడు పార్టీల అధిష్టానాల ఆశీర్వాదం కోసం అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కైకలూరు నియోజకవర్గం లో 2014లో పొత్తులో భాగంగా బిజెపి కి సీటు కేటాయించడం అక్కడ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ గెలుపొందడం తో పాటుగా మంత్రి పదవిని సైతం సాధించారు. ఇప్పుడు మరల ఇదే సీన్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కైకలూరు సీటు బీజేపీ తీసుకొని కామినేని శ్రీనివాస్ పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతుంది. ఇక మిగిలిన పోలవరం నియోజకవర్గం కోసం మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ 5 సీట్ల లో పోటీ లో ఉండగా పోలవరం కూడా తీసుకొంటే ఆ సంఖ్య 6 కి పెరిగే అవకాశం ఉంది. పోలవరం నియోకవర్గానికి సంబంధిచి రాజకీయంగా పలుకుబడి ఉన్న కరాటం కుటుంబంతో పాటూగా అక్కడ జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రి బాలరాజు సైతం ప్రజా సమస్యల పై తన వంతు పోరాటం చేస్తున్నారు. జనసేన పార్టీ నుండి సీటు ఆశించే వారిలో మాజీ ఎమ్మెల్యే మనవడు మొడియం సూర్యచంద్ర రావు పేరు కూడా గట్టిగ వినపడుతుంది. ఇక టీడీపీ నుండి బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ లు తాము కూడా పోటీ కి సిద్దం అంటూ కేడర్ను ఉత్సాహపరుస్తున్నారు.
మొత్తంగా ఏలూరు పార్లమెంట్ లో కూటమి సీట్ల పంచాయితీ త్వరగా కొలిక్కి రాకపోతే అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో టీడీపీ- జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా ఎప్పుడు ఎవరి సీటు గల్లంతు అవుతుందో ఎవరికి సీటు వరిస్తుందో అంచనా వేయటం కూడా కష్టమైపోతుంది. గెలవాలనే ఆకాంక్షలతో సీటు త్యాగం చేయలేక విలవిలలాడిపోతున్నారు ఆయా పార్టీల నేతలు. ఓవరాల్గా ఈ కుర్చీల ఆటలో గెలిచేదెవరో , ఓడేదెవరో అంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు ఏలూరు పార్లమెంట్ ప్రజలు.