Temporary Cancellation of Telangana Prajavani(Telangana news today): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పరిపాలనలో అనూహ్య మార్పులు తీసుకొచ్చింది. ప్రజలకు చేరువలోనే పాలన ఉండాలన్న ఉద్దేశ్యంతో రేవంత్ సర్కార్ ప్రగతిభవన్ ను ప్రజాభవన్ గా మార్చి.. వారి సమస్యలను నేరుగా అర్జీల రూపంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించింది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో బేగంపేటలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. ప్రజలు తమ సమస్యలను అర్జీలుగా సమర్పించేందుకు తరలి వచ్చారు. అయితే.. ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Also Read : బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ..
ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 16వ తేదీ సాయంత్రం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నోడల్ అధికారిణి దివ్య వెల్లడించారు. తిరిగి జూన్ 7వ తేదీన ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ 85 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.85 లక్షల మంది వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అర్హులుగా ఉన్నట్లు చెప్పారు.
ఇక.. పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల విషయానికొస్తే మొత్తం 7 విడతలుగా ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. దేశంలో 97 కోట్ల ఓటర్లు ఉండగా.. వారిలో పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు ఉన్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు 82 లక్షల మంది ఉంటే.. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు 1.8 కోట్ల మంది ఉన్నారు.