Pamula Pushpa Srivani Politics(Latest political news in Andhra Pradesh): వారిది రాజవంశం .. రాచరికాలు పోయినా తమ ప్రాంతంలో అదే పెత్తనం కొనసాగిస్తూ వచ్చింది ఆ కుటుంబం .. దశాబ్దాలుగా ఆ కుటుంబం వారే అక్కడి ఎమ్మెల్యే.. మంత్రి పదవి కూడా అనుభవించారు.. పార్టీలు వేరైనా బయటి వారికి పదవులు దక్కకుండా రాజకీయం చేయడంలో వారు సిద్ద హస్థులన్న పేరుంది .. ఆ క్రమంలో ప్రస్తుతం అధికారం చలాయిస్తున్న అక్కడి ఎమ్మెల్యేపై ప్రజలు గుర్రుగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది .. వారి పెత్తనం ఇక చాలని సొంత పార్టీ నాయకులే అంటున్నారంట .. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?.. ఎందుకు అంత నెగిటివ్ అయ్యారు
కురుపాంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీవాణి డిప్యూటీ సీఎంగా పనిచేసిన పుష్ఫశ్రీవాణి
చినమేరంగి రాజుల వంశస్తురాలు పాముల పుష్ఫ శత్రుచర్ల మద్దతుతో విజయం సాధించిన మాజీమంత్రి
మంత్రి అయ్యాక పెరిగిన విమర్శలు, వివాదాలు రాజవంశంపై అవినీతి ఆరోపణలు వైసీపీ శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తి అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శలు ఎమ్మెల్యే భర్త చేతివాటంపై ఆరోపణలు
విజయంపై ధీమాగా ఉన్న పుష్ఫశ్రీవాణి మామ శత్రుచర్ల సహకరిస్తారని ధీమావాయిస్ పాముల పుష్ప శ్రీవాణి .. వైసీపీ నుండి 2014, 2019 లో కురుపాం ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 నుండి మూడేళ్ళ పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా , గిరిజన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె ప్రజలతో మమేకమవ్వడం. ఎప్పటికపుడు వారి సమస్యలను వీలైనంతమేరకు పరిష్కరించడం. రెండవసారి గెలవడానికి దోహదపడ్డాయి.
Also read: వైసీపీ ఫిర్యాదు.. చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు
ముఖ్యంగా మొదటిసారి పోటీ చేసినపుడు ఈమెకు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా చినమేరంగి రాజుల వంశస్తురాలు అవ్వడం… ఆమె పెద మామ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మద్దతు కూడా ఉండడంతో విజయం నల్లేరు మీద నడకలా సాగింది … ఎస్టీ కొండ దొర తెగకు చెందిన వీరి కుటుంబం అంటే అక్కడి ప్రజలకు ఎనలేని విశ్వాసం ఉండడంతో రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు పుష్ప శ్రీవాణి .
అయితే రెండోసారి గెలిచి మంత్రి అయిన దగ్గరనుండి ఈమెపై విమర్శలు పెరిగి వివాదాలు చుట్టుముట్టాయి. చినమేరంగి రాజులపై ఎన్నడూ లేని విధంగా అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులను దిగమింగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.. మరో వైపు వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా తమను పట్టించుకోవడం లేదని బహిరంగంగానే అసంతప్తి వెల్లగక్కుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలు కూడా వ్యతిరేకతతో కనిపిస్తున్నారు
మూడేళ్లపాటు మంత్రిగా పని చేసినా నియోజకవర్గ అభివృద్దిని పట్టించుకోలేదని శ్రీవాణిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి … మంత్రి అయ్యాక ఆస్తులు పోగేసుకున్నారని, ఆమె భర్త పరిక్షిత్ రాజు కూడా ఎక్కడికక్కడ చేతివాటం ప్రదర్శిస్తున్నారని సొంత పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది.. కనీసం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చలేదనేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. గిరిజనుల ఓట్లతో పదవులు అనుభవిస్తున్న పుష్ప శ్రీవాణి గిరిజనం సమస్యలపై సీత కన్ను వేసారనే చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్యే అయ్యి పదేళ్లవుతున్నా గుమాలక్ష్మీపురం , కురుపాం, జియ్యమ్మవలస , కొమరాడ ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన మౌలిక వసతులు కల్పించలేదంటున్నారు. కొమరాడ మండలంలో ఉన్న పూర్ణపాడు లాబేసు వంతెన ఇప్పటికీ పూర్తి చేయకపోవడంపై గిరిజనులు ఆగ్రహంతో కనిపిస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ మాయమాటలు చెప్పి మోసం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఒట్టిగెడ్డ రిజర్వాయర్ ను కూడా పూర్తి చేయలేకపోయారనే అసంతృప్తి కూడా జనంలో వ్యక్తం అవుతోంది..
దాంతోపాటు 2019 ఎన్నికల్లో స్వయంగా జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన జీడి పిక్కల ప్రాసెసింగ్ పరిశ్రమ ఊసే లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు 150 కోట్ల రూపాయలతో మంజూరైన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణాన్ని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బంగారు బాతులా వాడుకున్నారు తప్ప , పూర్తి చేయలేకపోయారని యువతలో అసహనం పెరిగినట్లు కనిపిస్తోంది. రెండేళ్ల నుండి అడ్మిషన్లు ప్రారంభిస్తాం అని మాటలు తప్ప చేతలు లేవని యువత నిరుత్సాహపడుతోంది. ఇంజనీరింగ్ కళాశాల తెచ్చేశాం అన్న ప్రగల్భాలు తప్ప .. దాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో గిరిజనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు
ఇక అన్నిటికీ మించి కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. పంటపొలాల్లోకి వచ్చి ఏనుగులు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. పంట పొలాలు, ఆస్తులు విధ్వంసమే కాదు ప్రజలు మృత్యువాత పడటం పరిపాటిగా మారింది.. ప్రభుత్వం వాటిని నీయంత్రించలేకపోవడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఏనుగుల్ని కట్టడి చేయడం కాదు కదా కనీసం బాధితులకు నష్ట పరిహారం చెల్లించడానికి కూడా స్థానిక ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏనుగుల దాడిలో ఎవరైనా చనిపోతే కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, అది కూడా అందరికీ అందడం లేదన్నది మరో విమర్శ. నష్టపరిహారం పది లక్షలు చేయాలని పలుమార్లు విన్నవించుకున్నా. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
కురుపాం నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత కనిపిస్తున్నా. తన విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు పుష్ఫశ్రీవాణి.. కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి తోయక జగదీశ్వరికి అంగ బలం, అర్ధ బలం తక్కువ అవ్వడం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారంట.. అదీకాక తన మామ శత్రుచర్ల విజయరామరాజు టీడీపీలో ఉన్నప్పటికీ. వచ్చే ఎన్నికల్లో లోపాయికరంగా తనకే మద్దతిస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారట పుష్పశ్రీవాణి. చూడాలి మరి ఆమె లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో