Political Heat in Puttaparthi: ప్రశాంతంగా ఉండే పుట్టపర్తిలో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అక్కడ కూడా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు కేటాయించడం ఆ పార్టీలో కాక రేపుతోంది. మళ్లీ టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని ఇప్పటికే స్థానిక వైసీపీ నేతలతో ఉన్న విభేదాలు టెన్షన్ పెట్టిస్తున్నాయంట. వారిని బుజ్జగించడానికి వైసీపీ పెద్దలను ఆశ్రయించినా పనవ్వలేదంట. మరోవైపు వైసీపీలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు మీటింగ్ పెట్టుకుని ఆయన్ని ఓడించడానికి డిసైడ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
పుట్టపర్తి.. వేలాది మంది భక్తులు, వీఐపీలు నిత్యం వచ్చిపోయే ఆద్యాత్మిక నగరం. ఇక్కడ రాజకీయం కూడా ఎప్పుడూ సైలెంట్ గా కామ్ గా ఉంటుంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పుట్టపర్తిలో కూడా పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటారు. అయితే పుట్టపర్తి లో మాత్రం పరిస్థితి తేడాగా కనిపిస్తోంది. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ .. వారి దిష్టిబొమ్మలు తగలబెట్టించడం పెద్ద చర్చకే దారితీసింది.
ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించింది వైసీపీ. అదే ఇప్పుడు ఆయన్ని తెగ టెన్షన్ పెడుతోందంట. ఇప్పటికే సొంత పార్టీ వారికి వ్యతిరేకంగా దిష్టి బొమ్మల దహనాలు, ధర్నాలు చేయించారాయన. ఎమ్మెల్యే వైఖరి చూస్తూ అప్పట్లో పుట్టపర్తివాసులు తెగ ఆశ్చర్యపోయారు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బ్యాంకులను 900 కోట్లు పైగా మోసం చేశారని, ఆ డబ్బులు కట్టకపోవడంతో.. ఆయన ఆస్తులు వేలం వేస్తామని కెనరా బ్యాంక్ ప్రకటించింది. దాంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆ ఎపిసోడ్లో అటు విపక్షాలకు, ఇటు సొంత పార్టీలో ఎంతో కాలంగా అవకాశం కోసం చూస్తున్న వ్యతిరేకవర్గానికి టార్గెట్ అయ్యారు.
Also Read: మూడ్ ఆఫ్ ఆంధ్ర.. బిగ్ టీవీ సర్వే ఫలితాలు.. ఆ పార్టీకే అధికారమా..?
దాంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి తన కోపాన్ని తన పార్టీ వారిపై చూపించారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చేతిలో పరాజయం పాలైన కొత్తకోట సోమశేఖర్ రెడ్డి ఆయన కుమారుడు కొత్తకోట చక్రధర్ రెడ్డితో పాటు.. పనిలో పనిగా తన పాత రాజకీయ ప్రత్యర్థి అయిన పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డిలపై కక్షపూరితంగా వ్యవహరించారు. పల్లె రఘునాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి కలిసి తనపై కుట్ర పన్నుతున్నారంటూ తన అనుచరగణంతో వారిద్దరి దిష్టిబొమ్మలను తగలబెట్టించారు.
కొత్తకోట సోమశేఖర్ రెడ్డి ఇటీవల కాలంలో వైసీపీ నుంచి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. పల్లెల్లో తిరుగుతూ వైసీపీ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేస్తూ అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న సోమశేఖర్ రెడ్డి జనాల్లో తిరుగుతుండడంతో ఎమ్మెల్యేకి టికెట్ భయం పట్టుకుని కోపం వచ్చిందంట. దీంతో సొంత పార్టీ సీనియర్ నేత అని కూడా చూడకుండా దిష్టిబొమ్మ లు దహనం చేయించారట.
ఇప్పుడు సీటు ఖరారు అవ్వడంతో దిష్టి బొమ్మలు తగలబెట్టిన ఎఫెక్ట్ ఇప్పుడు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో అని శ్రీధర్రెడ్డి టెన్షన్ పడుతున్నారంట. వారు తనకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండటానికి.. పార్టీ పెద్దలతో బుజ్జగింపచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారంట. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. వారు స్వయంగా సీఎం జగన్ చెప్పినా వెనక్కు తగ్గేది లేదు అని చెప్పేశారట. ఇటీవల పాముదుర్తి ఇంద్రజిత్ రెడ్డిని వైసీపీ అధ్యక్షుడు పిలిపించుకుని మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయిందంట. తాను ఎట్టి పరిస్థితుల్లో శ్రీధర్రెడ్డి కి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని జగన్ ముందే మొహమాటం లేకుండా చెప్పారట.
Also Read: పెదకూరపాడులో మామా అల్లుళ్ల మధ్య ఎన్నికల యుద్ధం.. ఓటర్లు ఎటువైపు..?
ఇక మరో నేత లోచర్ల విజయ్ భాస్కర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే శ్రీదర్ రెడ్డి పై ఆగ్రహంతో ఉన్నారు. టికెట్ శ్రీధర్రెడ్డికి దక్కకుండా ఆయన ఎంతో ట్రై చేశారు. ఇప్పుడు ఆయనకే టికెట్ దక్కడంతో సపోర్ట్ చేసే ప్రసక్తే లేదంటున్నారు. పుట్టపర్తిలో మంచి పలుకుబడి ఉన్న నేతల్లో ఒకరు విజయ్భాస్కర్రెడ్డి.. ఆయన తండ్రి పేరుతో పెద్ద కాలనీ ఉందంటే ఆయనకు ఎంత పేరుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటాయన్ని రాజకీయవైరంతో దూరం పెట్టారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అంతేకాక ఆయన తండ్రి విగ్రహన్ని కూడా ధ్వంసం చేయించారు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మొత్తం తన గెలుపుపై పడుతుందని టెన్షన్ పడుతున్నారంట.
ఈ ముగ్గురు సీనియర్ నేతలు తనకు ఎక్కడ హ్యాండ్ ఇస్తారో అని వారికి నచ్చ చెప్పే బాధ్యతను అధిష్టానానికి అప్పచెప్పాడట. టికెట్ అనౌన్స్ అయి నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు అధిష్టానం దూతలు ఇంక వారిని సంప్రదించకపోవడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కి టెన్షన్ పెరిగిపోతుందట. స్వయానా తానే వాళ్ల దగ్గరకు వెళ్దామంటే ముఖం చెల్లడం లేదంట. ఒకవేళ వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో అని వెళ్ళే సాహసం చేయలేకపోతున్నరంట.
అయితే ఆయన విషయంలో పుణ్యకాలం అంతా గడిచిపోయినట్లే కనిపిస్తోంది. శ్రీధర్రెడ్డి వ్యతిరేక నేతలు ఒకటై మీడియా ముందుకు వచ్చారు. కనీసం తమను సంప్రదించకుడా ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారని ఫైర్ అయ్యారు. శ్రీధర్ రెడ్డికి సహకరించే ప్రసక్తే లేదని కొత్తకోట సోమశేఖర రెడ్డి, పాముదుర్థి ఇంద్రజిత్ రెడ్డి, లోచార్ల విజయ భాస్కర్ రెడ్డిలు తేల్చి చెప్పారు. ఈ వ్యతిరేకులు ముగ్గురూ గట్టి నాయకులే అవ్వడంతో శ్రీధర్రెడ్డికి ఏం చేయాలో ఇప్పుడు పాలుపోవడం లేదంట.