Nalini Released : దాదాపు 32 ఏళ్ల తర్వాత జైలు నుంచి విముక్తి లభించింది. అందరిలాగే మళ్లీ సాధారణ జీవితం గడిపే అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు కారాగారంలో మగ్గిన వారికి.. ఇది మరో పునర్జన్మలాంటిది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో దోషులుగా ఉన్న ఆరుగురు జైలు నుంచి విడుదల అయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో వారికి జైలు నుంచి విముక్తి దొరికొంది. ఇది తనకు కొత్త జీవితం లాంటిందని.. జైలు నుంచి విడుదలైన నళిని సంతోషాన్ని వ్యక్తం చేసింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడులోని వేల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆమెను రిలీజ్ చేశారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు కారాగారం జీవితం గడిపిన ఆమె.. రిలీజ్ సందర్భంగా భావోద్వేగానికి గురైంది. 32 ఏళ్ల పాటు తనకు అండగా నిలిచిన తమిళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నా భర్త, కుమార్తెతో నాకు ఇది కొత్త జీవితం. మేం 32 ఏళ్లుగా విడిపోయాం. మా కుటుంబం నా కోసం ఎదురుచూస్తూనే ఉందని నళిని పేర్కొన్నారు. గాంధీ కుటుంబంలో ఎవరినీ కలవడానికి ప్లాన్ చేసుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నళిని ధన్యవాదాలు చెప్పారు .
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే నళిని జైలు విడుదల కాగా..మిగిలిన నలుగురు దోషుల రిలీజ్కు కూడా అంతా సిద్ధమైంది. త్వరలోనే వారు కూాడా కారాగారం విడుదల కానున్నారు. దోషుల్లో ఇద్దరైన రాబర్ట్ పయస్, జయకుమార్ను పుజల్ సెంట్రల్ నుంచి తిరుచ్చికి తరలించారు. మరో ఇద్దరు దోషులైన మురుగన్, శాంతన్లను కూడా వెల్లూరు జైలు నుంచి తిరుచ్చికి తరలించారు పోలీసులు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక…వీరిని కూడా వదలిపెట్టనున్నారు.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. హత్య కేసులో నళిని, శ్రీహరన్ అలియాస్ మురుగన్, శంతను, ఏజీ పెరారివాళన్, జయకుమార్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్లను దోషులుగా తేల్చారు. తొలుత కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత జీవితఖైదుగా శిక్షను తగ్గించింది. 30 ఏళ్ల జైలు జీవితం తర్వాత దోషుల్లో ఒకరైన పెరారివాళన్ సుప్రీంకోర్టులో క్షమాభిక్ష పిటిషన్ వేసారు.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతేడాది మే 18న అతన్ని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత నళిని, రవిచంద్రన్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వాజ్యాలపై కూడా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్తానం.. పెరారివళన్కు ఇచ్చిన తీర్పే మిగిలిన ఆరుగురికీ వర్తిస్తుందని కోర్టు స్పష్టంచేసింది. దీంతో మూడు దశాబ్ధాల తర్వాత వారికి కూడా జైలు నుంచి విముక్తి లభించింది.