Telangana CEO Vikas Raj Press Meet: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లను సీఈఓ వికాస్ రాజ్ వివరించారు. రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 85 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. హోమ్ ఓటింగ్ కోసం ఫామ్ -డి దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. మరో మూడు రోజుల్లో హోం ఓటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఆర్వో వద్ద పోస్టల్ ఓట్ అప్లికేషన్లు ఉన్నాయని వికాస్ రాజ్ తెలిపారు. ఆర్వో, డీఈఓ, పోలీస్ అధికారులకు ఢిల్లీలో శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, సెక్టోరల్ స్థాయిలో కూడా శిక్షణ ఇచ్చామని వివరించారు. మరి కొంతమంది పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. లక్షా 85 వేల 612 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని వెల్లడించారు. 35, 356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. 71,968 బ్యాలెట్ యూనిట్లు, 49,692 కంట్రోల్ యూనిట్లు, 54,353 వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సింకిద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ వివరించారు. ఇక్కడ బై పోల్ కోసం 500 బీయూ, 500 సీయూ, 500 వీవీ ప్యాట్లు అవసరం ఉందని తెలిపారు. 1080 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారని తెలిపారు.
Also Read: వికసిత్ భారత్కు ఓటు.. మే 13న చారిత్రాత్మక తీర్పు : ప్రధాని మోదీ
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలున్నాయి. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత విజయం సాధించారు. అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగబోతోంది. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.
ఎన్నికల నిబంధనలు వికాస్ రాజ్ వివరించారు. రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఒకవేళ తీసుకెళ్లినా అందుకు సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు. లేదంటే ఈ నగదను సీజ్ చేస్తామని హెచ్చరించారు.