Delhi Liquor Scam Latest Update: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఈడీ అధికారులు ప్రకటించారు. రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారం కవిత ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఆప్ నేతలకు కవిత వంద కోట్లు చెల్లించారని అధికారులు తెలిపారు. లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేశామని.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు హైదరాబాద్, చెన్నై, ముంబై సహా 245 చోట్ల సోదాలు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. రూ. 128 కోట్ల ఆస్తులను సీజ్ చేశామని పేర్కొన్నారు. ఆప్ నేతలు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్తో కవితకు సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు స్పష్టం చేశారు.
మార్చి 23 వరకు కవిత తమ కస్టడీలో ఉంటారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఆ సమయంలో కవిత బంధువులు తమను అడ్డుకున్నారని చెప్పారు.
ఢిల్లీ మద్యం పాలసీలో రూపకల్పన, అమలులో లబ్ధి పొందేందుకు కవితతో పాటు మరి కొంతమంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలతో కలిసి కుట్రపన్నారని దర్యాప్తులో వెల్లడైందని ఈడీ అధికారులు పేర్కొన్నారు.