Rains in AP & Telangana: తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృమై ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
సోమ, మంగళవారాల్లో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Also Read: తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజీనామా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ ?
మరోవైపు హైదరాబాద్ లో ఇప్పటికే వర్షం మొదలైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వాన కురుస్తోంది. దీంతో నగర ప్రజలను ఎండల వేడి నుంచి కాస్త రిలాక్స్ అవుతున్నారు.
మరోవైపు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. బుధవారం కోస్తాంధ్రలో 6 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎండలతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలతో కాస్త ఉపశమనం కలగనుంది.