CM Jagan: మోదీ విశాఖ సభలో సీఎం జగన్ స్పీచ్ విన్నారా? రొటీన్ కు భిన్నంగా ఉంది కదూ. అవును, జగన్ ప్రసంగం చాలా మందిని మెప్పించింది. శ్రీశ్రీ, వంగపండు పదాలను ప్రస్తావిస్తూ.. సూటిగా పలు అంశాలను మోదీ ముందుంచారు. పైపైన చూస్తే మోదీని పొగిడినట్టే ఉంటుంది. లోతుగా పరిశీలిస్తే.. అసలు విషయం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
‘కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదు’ –జగన్
ఈ కామెంట్ లో.. మొదటి వ్యాఖ్యానికి.. రెండో వ్యాఖ్యానికి చాలా తేడా ఉందంటున్నారు. బీజేపీ, వైసీపీ పార్టీలు వేరైనా.. కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాల పరంగా రాజకీయాలకు అతీతంగా అనుబంధం ఉందనే అర్థంలో మాట్లాడారు. అంటే తమ మధ్య ఎలాంటి పొత్తు లేదనేది జగన్ భావన కావొచ్చు. అదే సమయంలో, రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదంటూ.. ఇచ్చిన హామీలపై తగ్గేదేలే అనే భావం వచ్చేలా చాలా అందమైన భాషలో చెప్పారని అంటున్నారు.
‘పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు.. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు.. ఏపీ విన్నపాలకు కేంద్రం సహాయ సహకారాలు అందించాలి’ –జగన్
ఇది మరింత ఆసక్తికర స్టేట్ మెంట్. బహిరంగ వేదికపై విభజన హక్కుల గురించి నేరుగా ప్రధాని మోదీనే నిలదీశారు సీఎం జగన్. కేసులకు భయపడి కేంద్రానికి జగన్ సరెండర్ అయ్యారని, ప్రత్యేక హోదా డిమాండ్ ను అటకెక్కించారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపై చిత్తశుద్ధి లేదని, పోలవరం నిధులు సాధించడం లేదని.. అదని ఇదని ప్రతీరోజు విపక్షాలు జగన్ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలన్నిటికీ ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు సీఎం జగన్. లక్షల మంది ప్రజానీకం సమక్షంలోనే.. ఏపీ హక్కులన్నీ నెరవేర్చాలంటూ మోదీని రిక్వెస్ట్ చేయడం.. సార్ సార్ అంటూనే అడగాల్సినవన్నీ అడిగేయడం.. జగన్ రాజకీయ నీతికి నిదర్శనం అంటున్నారు.
జగనన్న స్పీచ్ అదుర్స్ అని వైసీపీ వర్గాలు సంబరపడుతుంటే.. నాడు ఆ మాట, నేడు ఈ మాట.. అంటూ జగన్ పాత వీడియోలను వైరల్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.