MLC Kavitha Petition: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మనీలాండరింగ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే తనను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయమని కోర్టుకు చెప్పారని.. అయినా సరే అక్రమంగా అరెస్టు చేశారంటూ.. కవిత తరఫు న్యాయవాది నేడు ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని పిటషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ అధికారులు ఏడురోజుల కస్టడీకి తరలించి విచారిస్తున్నారు. ఈ మనీలాండరింగ్ కేసులో విత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని ఈడీ అధికారులు ఈరోజు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే కవితకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర రెడ్డిలు వాంగ్మూలం సమర్పించారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు కవిత ద్వారా ధ్రువీకరించనున్నారు.
Also Read: RS Praveen Kumar : నేడు బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కేసీఆర్కు పుట్టావంటూ విశారదన్ ట్వీట్
అయితే గతంలో కవితను విచారించినప్పుడు తాము అడిగిన ప్రశ్నలకు కవిత తప్పించుకునే సమాధానాలు ఇచ్చినట్లు ఇదివరకే ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కవితను ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు కుటుంబ సభ్యులను లాయర్లను కలుసుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం విచారణ ముగిసిన అనంతరం తన అన్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు కలిసారు.