T20 Worldcup : టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరింది. ఆదివారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా ఫైనల్ ఫైట్ జరగనుంది. ఏ జట్టు టైటిల్ సాధిస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈటోర్నిలో కొన్ని మ్యాచ్ లు వర్షం వల్ల రద్దయ్యాయి . దీని ప్రభావం సెమీ ఫైనల్ బెర్త్ లపైనా పడింది. ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు టోర్ని నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ఆదివారం వర్షం పడే సూచనలు 85 శాతం ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. నాకౌట్ దశలో జరిగే మ్యాచ్లకు రిజర్వ్ డేను కేటాయిస్తారు. దీంతో ఫలితం వచ్చే అవకాశాలుంటాయి. అయితే రిజర్వ్ డేలో కూడా వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ రెండు రోజులు వర్షంతో ఆగిపోతే టి20 ప్రపంచకప్ చప్పగా ముగిస్తుంది. అందుకే ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ రూల్స్ను సవరించింది. ఆ రూల్స్ కేవలం ఈ మ్యాచ్ వరకు మాత్రమే పరిమితం. కొత్త రూల్ ప్రకారం రిజర్వ్ డే రోజు నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోతే.. మరో రెండు గంటలు అదనంగా కేటాయిస్తారు. ఒకవేళ ఆ రెండు గంటలు ఎలాంటి వర్షం లేకపోతే 10 ఓవర్ల చొప్పున మ్యాచ్ను నిర్వహిస్తారు. ఇది కూడా సాధ్యపడకపోతే అప్పుడు ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఐసీసీ ప్రకటించింది. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ జరిగే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కు ఉత్తర్వులు పంపింది.
వర్షం అడ్డుపడినా సాధ్యమైనంత వరకు ఫైనల్ మ్యాచ్ను నిర్వహించాలనే సంకల్పంతో ఐసీసీ ఉంది. నవంబర్ 13న వర్షంతో మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే నవంబర్ 14న మ్యాచ్ కొనసాగిస్తుంది. అప్పటికి వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్ నిర్వహించేందుకు మరో 2 గంటల అదనపు సమయం కేటాయించింది. ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించడం అనేది చివరి ఆప్షన్ మాత్రమేనని ఐసీసీ స్పష్టం చేసింది.