YS Sharmila Contesting Andhra Pradesh 2024 Elections as MP from Kadapa: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. కడప నుంచి పోటీ చేయాలని ఆమెకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ పెద్దల కోరిక మేరకు ఆమె కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం.
కాంగ్రెస్ విడుదల చేసే ఈ తొలి జాబితాలో మొదటి పేరు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలదే ఉండే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇప్పటికే వైసీపీ పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి దాదాపు సగం కంటే ఎక్కువ మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినా సరే ఎటువంటి ప్రకటనా చేయలేదు. మంగళవారం జరిగే కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Jammalamadugu Ticket War : బాబాయ్ VS అబ్బాయ్.. ఆదినారాయణ ఫ్యామిలీలో జమ్మలమడుగు టికెట్ వార్
అనుకున్నట్లు కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా వైఎస్ షర్మిల చేస్తే.. వైసీపీకి గట్టి దెబ్బే తగలనుంది. ఇక్కడ్నుంచి వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాశ్ కు జగన్ సీటు ఇచ్చారు. అయితే అక్కడి ప్రజలు ఆయనపై వ్యతిరేకతతో కచ్చితంగా కాంగ్రెస్ను ఆదరిస్తారని హైకమాండ్ గట్టి నమ్మకంతో ఉంది. వైఎస్ షర్మిల కడప అభ్యర్థిగా బరిలో దిగితే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు బరిలోకి దిగినట్లు అవుతుంది. వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేస్తారని దాదాపు ఖరారైన నేపథ్యంలో.. అవినాశ్ వర్సెస్ షర్మిల మధ్య పెద్ద సమరమే జరగనుంది.