Jammalamadugu Ticket War in Adi Narayana Family: జమ్మలమడుగు టికెట్ ఇష్యూ దేవగుడి ఫ్యామిలీలో కాక రేపుతోంది. మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణరెడ్డి, ఆయన అన్న కొడుకు భూపేష్రెడ్డి టికెట్ నాకంటే నాకని పట్టుబడుతున్నారు. పొత్తుల లెక్కలతో ఆదినారాయణ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి రెడీ అయితే .. జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న భూపేష్ తనకు అడ్డంకిగా మారిన బాబాయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారంట. ఆ బాబాయ్, అబ్బాయ్ల పంచాయతీని తేల్చలేక చంద్రబాబునాయుడే చేతులెత్తేశారంట .. ఎవరు పోటీలో ఉంటారో మీరే తేల్చుకోండని బంతిని వారి కోర్టులోకే నెట్టేశారంట
కడప జిల్లా జమ్మలమడుగు. ఈ నియోజకవర్గం ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. దశాబ్దం క్రిందటి వరకు అక్కడ ఎన్నికలు అంటే నియోజకవర్గ ప్రజల్లోనే కాదు రాష్ట్రంలోనే ఉత్కంఠ రేగేది. క్రమక్రమంగా ఫ్యాక్షన్ వాసనలు తగ్గుతూ వచ్చిన జమ్మలమడుగులో ఇప్పుడు మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణరెడ్డి ఫ్యామిలీలో నడుస్తున్న టికెట్ వార్ ఉత్కంఠభరితంగా తయారైంది.
జమ్మలమడుగు లో దేవగుడి , పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య ఉన్న వార్ ఇప్పుడు అబ్బాయ్, బాబాయ్ల మధ్య మొదలైంది. సీటు నాకంటే నాకని ఆదినారాయణ అన్న కొడుకు భూపేష్రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు పట్టుబడుతున్నారు. వారి పంచాయతీని ఎటూ తేల్చలేక చంద్రబాబు సైతం నిర్ణయాన్ని వారికే వదిలేశారట. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కేంద్రం అండ కోసం బీజేపీ గూటి చేరారు. ఆయన కాషాయకండువా కప్పుకున్నా.. భూపేష్రెడ్డి మాత్రం టీడీపీలో కొనసాగుతూ నియోజకవర్గ ఇన్చార్జ్గా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. ఎమ్మెల్యే కేండెట్గా ఫోకస్ అయ్యారు.
Also Read: పెదకూరపాడులో మామా అల్లుళ్ల మధ్య ఎన్నికల యుద్ధం.. ఓటర్లు ఎటువైపు ?
జమ్మలమడుగు టీడీపీ అభ్యర్ధిగా భూపేష్ పోటీ ఖాయమంటున్న తరుణంలో ఆదినారాయణరెడ్డి అక్కడ నుంచి పోటీ చేస్తానంటూ సీన్లో ఎంటర్ అయ్యారు. తన సీటుని బాబాయ్ తన్నుకుపోవాలని చూస్తుండటాన్ని భూపేష్ జీర్ణించుకోలేకపోతున్నారట. ఆదినారాయణ రెడ్డి గత 5 సంవత్సరాలుగా బీజేపీ లో కొనసాగుతున్నారు. మొన్నటి వరకు పోటీపై ఆసక్తి లేకపోయినప్పటికీ బీజేపీ, టీడీపీల పొత్తు ఖాయమై.. రాజకీయ సమీకరణాలు మారడంతో పోటీకి సిద్దం అయ్యారట.
సీట్లసర్దుబాటులో జమ్మలమడుగును బీజేపీని కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు కోరారంట. దాంతో వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి ఆదినారాయణ రెడీ అయ్యారు. అదే ఇప్పుడు దేవగుడి కుటుంబంలో అగ్గి రాజేసింది. ఇంతకాలం టీడీపీ కోసం కష్టపడితే ఇప్పుడు బాబాయ్ రేసులోకి రావడంతో.. తన భవిష్యత్తు ఏంటని భూపేష్ రెడ్డి ఆందోళన చెందుతున్నారంట.
అదే ఇప్పుడు కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది .. గత ఎన్నికల సమయంలో ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగుని వీడటంతో అక్కడ దేవగుడి వర్గం అంతా భూపేష్రెడ్డి వెంట నడుస్తూ వచ్చింది. ఇప్పుడు వారంతా భూపేష్కే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే టీడీపీఅధిష్టానం మాత్రం ఆదినారాయణరెడ్డి వైపే మొగ్గు చూపుతోందట. రాయలసీమలో చక్రం తిప్పిగలిగిన నేతగా ఆది అయితేనే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోగలరన్న అభిప్రాయంతో టీడీపీ పెద్దలు ఉన్నారంట.
Also Read: YSRCP Bus Yatra : సీఎం జగన్ బస్సు యాత్ర.. 21 రోజులు.. 25 బహిరంగ సభలు..
దేవగుడి కుటుంబ అంతర్గత సమావేశంలో కూడా ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని ఆదినారాయణ స్వయంగా భూపేష్ని కోరారట. అయితే భూపేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని అంటున్నారంట. మరి జమ్మలమడుగు సీటు ఏ పార్టీకి దక్కుతుందో? బాబాయ్, అబ్బాయిల్లో ఎవరు పోటీలో ఉంటారో చూడాలి.